తాండూరు, సెప్టెంబర్ 4: ఐదు రోజులపాటు ఘనమైన పూజలందుకున్న గౌరీ సుతుడికి ఆదివారం తాండూరు పట్టణంతోపాటు నియోజకవర్గంలోని తాండూరు, యాలాల, బషీరాబాద్, పెద్దేముల్ మండలాల ప్రజలు ఘనంగా వీడ్కో లు పలికారు. రంగురంగుల కాగితాలు, పూలు, విద్యుద్దీపాలతో అలంకరించిన వాహనాల్లో వినాయక విగ్రహాలను ఉంచి ఊరూరా కనులపండువగా శోభాయాత్రలు నిర్వహించారు. దారి పొడవునా భజనలు, నృత్యాల హోరుతో గణపయ్యకు భక్తులు నీరాజనం పలికారు. జై గణేశా…జై జై గణేశా.. అంటూ భక్తులు, యువతీయువకుల నినాదాలు మిన్నంటాయి. తీన్మార్ డ్యాన్సులు, ప్రత్యేక డోల్, బ్యాండ్, అతివల కోలాటం, చిన్నారుల కేరింతల మధ్య గణనాథులను వాగులు, చెరువులు భక్తిశ్రద్ధలతో నిమజ్జనం చేశారు.
హిందూ ఉత్సవ కేంద్ర సమితి తాండూరు శాఖ ఆధ్వర్యంలో సామూహిక వినాయక నిమజ్జనోత్సవం కనుల పండువగా సాగింది. సాయం త్రం 4 గంటలకు ప్రారంభమైన వినాయక నిమజ్జనోత్సవం సోమవారం తెల్లవారు జామువరకు కొనసాగింది. పట్టణంలోని వాడవాడల్లో ఐదు రోజులపాటు పూజలందుకున్న గణనాథులకు ప్రజలు, భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించా రు. పెద్దఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు, కోలాటాలు, భక్త జన మండలి సభ్యులతో భజనలు, యువకుల కేరింతల మధ్య వినాయక నిమజ్జనం వైభవంగా సాగింది. సామూహిక నిమజ్జన ఊరేగింపు కార్యక్రమాన్ని తిలకించేందుకు తాండూరు పట్టణంతోపాటు డివిజన్ పరిధిలోని తాండూరు, యాలాల, బషీరాబాద్, పెద్దేముల్, కొడంగల్, బొంరాస్పేట, దౌల్తాబాద్ మండలాలకు చెందిన ప్రజలు భారీగా తరలి రావడంతో రోడ్లు జనసంద్రంగా మారాయి. పట్టణంలోని గంజ్ కూడలి (మర్రి చెట్టు) వద్ద గణనాథుల సామూహిక ఊరేగింపు ప్రారంభమై గాంధీచౌక్, భద్రేశ్వరచౌక్, రైల్వేస్టేషన్, శాంతిమహాల్ చౌరస్తా, వినాయకచౌక్, ఇంద్రాచౌక్, అం బేద్కర్ చౌక్ల మీదుగా యాలాల మండలంలోని కోకట్లో ఏర్పాటు చేసిన నిమజ్జన స్థలానికి ర్యాలీగా తరలివెళ్లాయి.
కార్యక్రమంలో ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజూగౌడ్, రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్పటేల్, హిందూ ఉత్సవ కేంద్ర సమితి అధ్యక్షురాలు స్వప్న, కార్యదర్శి నర్సింహులు, రాజకీయ పార్టీల నేతలు, పట్టణ పురప్రముఖులు పాల్గొని భద్రేశ్వర చౌక్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై నుంచి పూలు, రంగులు చల్లారు. నిమజ్జన మహోత్సవంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ఆధ్వర్యంలో 450 మంది పోలీసులు విధులు నిర్వహించారు. భక్తులు, ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా మున్సిపల్, రెవెన్యూ, వైద్యారోగ్యశాఖ, అగ్నిమాపక అధికారులు, సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.