పరిగి టౌన్, ఆగస్టు 26: పరిగి సమీపంలోని విద్యారణ్యపురిలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను శుక్రవారం సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీదేవి, పరిగి జూనియర్ సివిల్ జడ్జి హరికుమార్ సందర్శించి పరిశీలించారు. గురుకుల పాఠశాలలో గురువారం టిఫిన్లో కప్ప వచ్చిందనే కథనాలు ప్రసార మాధ్యమాల్లో రావడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వారు గురుకుల పాఠశాలను సందర్శించారు. టిఫిన్ తిని అస్వస్థతకు గురైన విద్యార్థుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వంటశాల, విద్యార్థుల పడక గదులను స్వయంగా పరిశీలించారు. గురుకుల పాఠశాల పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంతో ప్రిన్సిపాల్పై అసహనం వ్యక్తం చేశా రు. పేద కుటుంబాలకు చెందిన పిల్లలే వసతి గృహాల్లో ఉండి చదువుకుంటారని.. వారిని తమ పిల్లలుగా భావించి నాణ్యమైన భోజనం అందించాలని ప్రిన్సిపాల్ వేణుగోపాల్కు సూచించారు. జరిగిన ఘటనపై ఉన్నతాధికారులకు నివేదికను అందిస్తామన్నారు. కార్యక్రమంలో ఆర్సీవో శారద, పేరెంట్స్ కమిటీ అధ్యక్షుడు సత్యయ్య, ఎంఆర్పీఎస్ జిల్లా నాయకుడు రమేశ్కుమార్, తదితరులు పాల్గొన్నారు.