వికారాబాద్, ఆగస్టు 25 : రైతుల శ్రేయస్సు కోసమే రూ.5కు అన్నపూర్ణ భోజనం పథకాన్ని ప్రవేశపెట్టినట్లు ఎమ్మెల్యే ఆనంద్ పేర్కొన్నారు. గురువారం వికారాబాద్ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో హరే కృష్ణ మూవ్మెంట్ తరఫున నిర్వహించిన రూ.5కే అన్నపూర్ణ భోజన పథకాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనంద్ మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు ఎక్కడా లేనన్ని సంక్షేమ పథకాలు అమలు చేసి రైతుల అభ్యున్నతికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు. వికారాబాద్ మార్కెట్ యార్డు 70 ఏండ్ల చరిత్రలో మొట్ట మొదటి సారి రూ.5లకే అన్నపూర్ణ భోజనం ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ప్రతి సోమవారం, గురువారాల్లో మార్కెట్కు వచ్చే రైతులు, హమాలీలకు రోజుకు 360 మందికి భోజన సదుపాయాన్ని కల్పించనున్నట్లు పేర్కొన్నారు. రూ. 2.02కోట్లతో మార్కెట్ను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ముద్ద దీప మాట్లాడుతూ మార్కెట్కు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అనేక విధాలుగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వారి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకుంటున్నట్లు చెప్పారు. అనంతరం అన్నపూర్ణ భోజన పథకంలో పాల్గొని రైతులతో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చంద్రశేఖర్రెడ్డి, ఎంపీపీ చంద్రకళ, రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్ రాంరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ ముత్యంరెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్కుమార్, కౌన్సిలర్లు పుష్పలతారెడ్డి, అనంత్రెడ్డి, గోపాల్, కృష్ణారెడ్డి, పావని, కృష్ణ, మార్కెట్ కమిటీ సభ్యులు, భక్తవత్సలం, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
పార్టీలో చేరిన కాంగ్రెస్ నాయకులు
వికారాబాద్ నియోజకవర్గం బంట్వారం మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ వార్డు సభ్యులు ఎన్. అనంతయ్య, సంతోష్, యూత్ అధ్యక్షుడు గోవర్ధన్, వీరేశం వారి అనుచరులు 150 మందితో ఎమ్మెల్యే ఆనంద్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే ఆనంద్ కండువా కప్పి ఆహ్వానించారు.