పరిగి/ఇబ్రహీంపట్నం, ఆగస్టు 7 : దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 వసంతాలు పూర్తవుతున్న సందర్భంగా వజ్రోత్సవ వేడుకలను 15 రోజులపాటు ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి పౌరుడిలో స్వాతంత్య్ర స్ఫూర్తిని మేల్కొలిపేలా నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్ర స్థాయిలో వజ్రోత్సవ కమిటీ ఏర్పాటు చేయగా, జిల్లా స్థాయిలో కమిటీకి చైర్మన్గా జిల్లా మంత్రి, కన్వీనర్గా జిల్లా కలెక్టర్ నియమితులయ్యారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్, మున్సిపల్ చైర్పర్సన్లు, జిల్లా ఉన్నతాధికారులతో కూడిన కమిటీ ఏర్పాటు జరిగింది. ఈ కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 8వ తేదీ సోమవారం నుంచి వజ్రోత్సవాలు ప్రారంభమై 22వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఇందులో భాగంగా ఇంటింటిపై జాతీయ జెండాలు రెపరెపలాడేలా ప్రతి ఇంటికీ జాతీయ జెండాల పంపిణీ సైతం చేపట్టనున్నారు. ప్రతి గ్రామంలో జాతీయత ఉట్టిపడేలా, పండుగ వాతావరణంలో ప్రభుత్వం వజ్రోత్సవ సంబురాలు నిర్వహించనున్నది.
జిల్లా వ్యాప్తంగా మున్సిపాలిటీలు, మండల పరిషత్, గ్రామపంచాయతీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉత్సవాల నిర్వహణకు ప్రణాళికలు రూపొందించి కార్యక్రమాల అమలు బాధ్యతలను జిల్లా స్థాయి అధికారులకు అప్పగించడం జరిగింది. ఈ విషయమై కలెక్టర్ నిఖిల వజ్రోత్సవాలపై జిల్లాస్థాయిలో సమీక్షా సమావేశాలు జరిపి దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో వివిధ రకాల పోటీలు సైతం నిర్వహించి విద్యార్థులకు బహుమతులు అందజేయనున్నారు. అలాగే ఉద్యోగులు, యువతకు క్రీడలు నిర్వహించనున్నారు. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఫ్రీడం పార్కులు ఏర్పాటుచేసి పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేపట్టారు. ఉత్సవాల్లో భాగంగా గ్రామపంచాయతీ, మున్సిపాలిటీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు.
దేశం గర్వించేలా వజ్రోత్సవాలను నిర్వహించాలి
స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాలను దేశం గర్వించేలా నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ మ్రంతి పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం ఆమె జిల్లా అర్బన్ స్థానిక సంస్థల సమావేశాన్ని వర్చువల్గా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో 8వ తేదీనుంచి 15రోజల పాటు స్వాతంత్య్ర వజ్రోత్సవాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. హైటెక్సిటీలో ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ఈ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించనున్నట్లు ఆమె తెలిపారు. కార్యక్రమానికి జిల్లాలోని ప్రజాప్రతినిధులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆమె కోరారు. రంగారెడ్డి జిల్లాలో వజ్రోత్సవాలను ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, యువజన సంఘాలు పాల్గొని వైభవంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. జిల్లాలోని ప్రతి ఇంటివద్ద మువ్వన్నెల జెండాను రెపరెపలాడించాలన్నారు. 22న ఎల్బీ స్టేడియంలో వజ్రోత్సవ కార్యక్రమ ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించాలని ఆమె అధికారులకు సూచించారు. సీఎం కేసీఆర్ వజ్రోత్సవాలను దేశం గర్వించేలా నిర్వహించేందుకు కేశవరావు అధ్యక్షతన ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆమె పేర్కొన్నారు. ఇంటింటా జాతీయ జెండాలు ఎగురవేస్తూ సమరయోధుల త్యాగాల చరిత్రను స్మరిస్తూ స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని ఎలుగెత్తి చాటాలని ఆకాక్షించారు. 1947కు ముందు పరిస్థితులు విరవిస్తూ అహింసాయుత మార్గంలో స్వాతంత్య్రాన్ని సాధించిన మహాత్మాగాంధీ సంకల్పాన్ని నేటి తరానికి అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.75వ స్వాతంత్య్ర వేడుకల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు. సమావేశంలో కలెక్టర్ అమయ్కుమార్, జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, వివిధ కార్పొరేషన్ల మేయర్లు, మున్సిపాలిటీల చైర్పర్సన్లు, అధికారులు పాల్గొన్నారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో వజ్రోత్సవ సంబురాల వివరాలు
8వ తేదీన హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో జరిగే స్వాతంత్య్ర వజ్రోత్సవాల ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనేందుకు జిల్లాలోని ఎంపీపీలు, జడ్పీటీసీలు ప్రత్యేక బస్సుల్లో వెళ్లనున్నారు.
9వ తేదీన ఇంటింటికీ జాతీయ పతాకాల పంపిణీ చేపట్టనుండగా, వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా 1.5లక్షల జాతీయ జెండాల పంపిణీ చేయనున్నారు. ప్రతి గ్రామం, మున్సిపాలిటీల్లో ప్రజా ప్రతినిధులు, అధికారులు కలిసి జాతీయ జెండాలు పంపిణీ చేస్తారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా స్థాయిలో డీఆర్డీవో, డీఎస్వో, డీపీవో పర్యవేక్షిస్తారు.
10వ తేదీ జిల్లాలోని ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఒక ఫ్రీడం పార్కును గుర్తించి పెద్ద ఎత్తున మొక్కలు నాటనున్నారు. మండల కేంద్రాల్లో సామూహికంగా ఒకచోట మొక్కలు నాటనున్నారు.
11వ తేదీ జిల్లాలోని ప్రతి మండలం, మున్సిపాలిటీల్లో పోలీసు శాఖతో కలిసి ఫ్రీడం రన్ నిర్వహిస్తారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో సంగెం లక్ష్మీబాయి గురుకులం నుంచి ఎన్టీఆర్ క్రాస్రోడ్డు వరకు ఫ్రీడం రన్ నిర్వహించనున్నారు. కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ, డీఈవో, డీటీడబ్ల్యూవో, మున్సిపల్ కమిషనర్ పర్యవేక్షిస్తారు.
12వ తేదీన జాతీయ సమైక్యతా రక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. జిల్లా పరిధిలోని అన్ని పట్టణాల్లో లోకల్ చానళ్లలో దేశభక్తి సినిమాలు, దేశభక్తి పాటలు ప్రసారమయ్యేలా చూస్తారు. ఈ కార్యక్రమాన్ని డీపీఆర్వో, డీఆర్డీవో పర్యవేక్షిస్తారు.
13న అన్ని మండల కేంద్రాలు, జిల్లా కేంద్రంలో ర్యాలీలు నిర్వహిస్తారు. జిల్లా కేంద్రంలో ఆలంపల్లి నుంచి బ్లాక్ గ్రౌండ్ వరకు ర్యాలీ నిర్వహిస్తారు. ఉద్యోగులు, ఎన్సీసీ క్యాడెట్లు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు.
14వ తేదీన తెలంగాణ సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో కళాజాత బృందాలతో జిల్లా కేంద్రం, నియోజకవర్గ కేంద్రాల్లో కళాజాత ప్రదర్శనలు. అనంతరం బాణసంచా కాలుస్తూ సంబురాలు.
15వ తేదీన స్వాతంత్య్ర దినోత్సవాన్ని యథావిధిగా నిర్వహిస్తారు.
16వ తేదీన జాతీయ గీతాలాపన, జిల్లా కేంద్రంలో కవి సమ్మేళన కార్యక్రమం ఉంటుంది.
17వ తేదీన జిల్లా కేంద్రంలో రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా రక్తదాన శిబిరం.
18న జిల్లాలో క్రీడాకారులు, ఉద్యోగులకు క్రీడా పోటీలు. జిల్లా కేంద్రంలోని బ్లాక్ గ్రౌండ్లో క్రీడల నిర్వహణ.
19వ తేదీన జిల్లాలోని దవాఖానలు, వృద్ధాశ్రమాలు, జైళ్లలో పండ్ల పంపిణీ కార్యక్రమం.
20వ తేదీ అన్ని గ్రామాలు, మండల కేంద్రాలు, జిల్లా కేంద్రంలోని బ్లాక్ గ్రౌండ్లో ముగ్గుల పోటీల నిర్వహణ.
21వ తేదీన ప్రత్యేకంగా గ్రామపంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ల సమావేశాలు
22న రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఎల్బీ స్టేడియంలో.. వికారాబాద్ జిల్లాకు సంబంధించి కలెక్టర్ కార్యాలయంలో వజ్రోత్సవ వేడుకల ముగింపు సమావేశం.