ధారూరు, ఆగస్టు 2 : గ్రామంలో ప్రతి ఇంటికీ సరిపడా మిషన్ భగీరథ నీరు అందించాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ఆదేశించారు. మంగళవారం గ్రామంలో ‘మీతో నేను’ కార్యక్రమంలో భాగంగా ధారూరు మండల పరిధిలోని హరిదాస్పల్లి గ్రామంలో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండల పరిధిలోని మైలారం గ్రామ పంచాయతీ పరిధిలోని కొత్తతండా గిరిజన మహిళలు ఎమ్మెల్యే ఆనంద్ను కలిసి తండాకురోడ్డు సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామంలో మిషన్ భగీరథ నీరు రాలేని సమయంలో కచ్చితంగా ప్రత్యామ్నాయంగా నీరు అందించే ఏర్పాటు చేయాలని సూచించారు. గ్రామంలో రెండు నెలలుగా నీటి సరఫరా ఆగిపోతే మిషన్ భగీరథ అధికారులు ఏం చేస్తున్నారని, మిషన్ భగీరథ అధికారులు వెంటనే హరిదాస్పల్లి గ్రామాన్ని సందర్శించి, సమస్యలు పరిష్కరించాలని వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలోని కలుపు మొక్కలు తొలగించాలని, శానిటేషన్ సరైన పద్ధతిలో లేదని, పల్లె ప్రగతిలో ఏం చేశారని, పంచాయతీ కార్యదర్శి, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ శానిటేషన్ సమస్యలు పునరావృతమైతే చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హెచ్చరించారు.
గ్రామంలో అత్యవసర నీటి సరఫరాకు చేతి పంపులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. వర్షాకాలం సందర్భంగా గ్రామంలో పరిసరాలను శుభ్రంగా ఉంచుకొని, తగు జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు సూచించారు. మండల పరిధిలోని మైలారం గ్రామ పంచాయతీ పరిధిలోని కొత్తతండాకు రోడ్డు సౌకర్యం కలిపించేందుకు కృషి చేస్తానని చెప్పారు. త్వరలో గ్రామానికి ఉన్న రోడ్డు సమస్య పరిష్కారం అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ధారూరు మండల అధ్యక్షుడు రాజునాయక్, ప్రధాన కార్యదర్శులు కావలి అంజయ్య, రాజుగుప్త, మాజీ మండల అధ్యక్షుడు వేణుగోపాల్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ వెంకట్రెడ్డి, వైస్ చైర్మన్ కృష్ణ, ఏఎంసీ చైర్మన్ సంతోష్కుమార్, వైస్ చైర్మన్ అంజయ్య, ఎంపీడీవో చంద్రశేఖర్, తహసీల్దార్ భువనేశ్వర్, ఏవో జ్యోతి, సర్పంచ్ అనితా, మండల పరిధిలోని వివిధ గ్రామాల సర్పంచులు వీరేశం, చంద్రమౌళి, శ్రీనివాస్, నాయకులు జైపాల్రెడ్డి, విజయ్కుమార్, రాములు, దేవేందర్ పాల్గొన్నారు.