బొంరాస్పేట, జూలై 28: జిల్లాలోకి ప్రసిద్ధ ఆలయం చేరింది. ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన దుద్యాల మండలంలోకి పోలేపల్లి గ్రామం కలిసింది. ఈ గ్రామంలో ఎన్నో ఏండ్ల నుంచి ప్రసిద్ధి చెందిన ఎల్లమ్మ ఆలయం ఉన్నది. దీంతో ఈ ఆలయం కూడా జిల్లాలోని పేరొందిన దేవాలయాల సరసన చేరింది. ఈ గుడికి ఎంతో చరిత్ర ఉన్నది. ప్రతి ఏటా మహా శివరాత్రికి ముందు వచ్చే శుక్రవారం నాడు ఎల్లమ్మ జాతరను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు మన రాష్ట్రంతోపాటు మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల నుంచి భక్తులు లక్షల సంఖ్యలో తరలివస్తారు. మినీ మేడారం జాతరను తలపించేలా కొనసాగుతుంది. సుమారుగా రెండు వం దల ఏండ్ల నుంచి ఇక్కడ ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. జాతర రోజుల్లోనే కాకుండా ఏడాది పొడవునా మంగళ, శుక్ర, ఆదివారాల్లో ఎల్లమ్మకు వేలాదిగా భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. పోలేపల్లి గ్రామం లో 42 అడుగుల ఎత్తైన ఆంజనేయస్వామి విగ్రహం కూడా ఉన్నది. ఈ విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నది. పోలేపల్లి గతంలో బొంరాస్పేట మండలంలోనే ఉండేది. కానీ, 2016 అక్టోబర్లో కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో బొంరాస్పేట మండలంలో ఉన్న హకీంపేట, పోలేపల్లి రెండు గ్రామాలు నారాయణపేట జిల్లాలోని కోస్గి మండలంలోకి వెళ్లాయి.
ఆరేండ్లకు నెరవేరిన ప్రజల ఆకాంక్ష
కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో కోస్గి మండలంలోకి వెళ్లిన పోలేపల్లి, హకీంపేట గ్రామాలను తిరిగి బొంరాస్పేట మండలంలోనే కలపాలని రెండు గ్రామాలవాసులు చాలా రోజులు ఆందోళనలు నిర్వహించారు. రెండు గ్రామాలకు తిరిగి బొంరాస్పేట మండలంలో కలుపుతామని 2018 ఎన్నికల సమయంలో ప్రస్తుత ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆయన పలు దఫాలుగా ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. బొంరాస్పేట మండలంలో పెద్ద గ్రామంగా ఉన్న దుద్యాలను కూడా మండల కేంద్రంగా చేయాలని ప్రజల నుంచి డిమాండ్ పెరిగింది. కాగా ఈ రెండు గ్రామాలను దుద్యాల కొత్త మండలంలో కలుపుతూ ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనలను సీఎం కేసీఆర్ ఆమోదించారు. దీంతో ఈ రెండు గ్రామాలు మళ్లీ ఆరేండ్ల విరామం తర్వాత జిల్లాలోకి వచ్చాయి. ఈ జిల్లా చార్మినార్ జోన్లో ఉండటంతో తమకు ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉంటాయని యువకులు ఆశాభావంతో ఉన్నారు. రెండు గ్రామాల ప్రజల ఆకాంక్షలను గౌరవించి జిల్లాలో కలిపినందుకు పోలేపల్లి, హకీంపేట గ్రామాల ప్రజలు ఎమ్మెల్యే నరేందర్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
యువత ఆనందోత్సాహం
దుద్యాల కొత్త మండలంగా ఏర్పాటు కావడంతో గ్రామానికి చెందిన పలువురు యువకులు స్వీట్లు పంచుకుని సంబురాలు చేసుకున్నారు. కొత్త మండల ఏర్పాటుతో తమకు బొంరాస్పేటకు వెళ్లే బాధ తప్పిందని, ప్రజల ఆకాంక్ష కూడా నెరవేరిందని హర్షం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా దుద్యాల మండలాన్ని త్వరలోనే ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలను ఎక్కడ ఏర్పాటు చేయాలో గ్రామస్తులు, ఎమ్మెల్యేతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని టీఆర్ఎస్ పార్టీ దుద్యాల మండలాధ్యక్షుడు చాంద్పాషా తెలిపారు.