పరిగి, జూన్ 26 : వయసుకు తగ్గ బరువు, ఎదుగుదల లేని చిన్నారులకు బాలామృతం ప్లస్ను వికారాబాద్ జిల్లాలోనూ అందజేసేందుకు సర్కారు నిర్ణయించింది. పిల్లల్లో ఎదుగుదలతోపాటు బరువు పెంపు కోసం ప్రభుత్వం బాలామృతం స్థానంలో మరిన్ని పోషక విలువలు గల బాలామృతం ప్లస్ను కుమ్రంభీం ఆసిఫాబాద్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి అమలుచేశారు. రెండు జిల్లాల్లో అందజేసిన బాలామృతం ప్లస్తో పిల్లల్లో ఎదుగుదల, బరువు పెరుగడం జరిగింది. దీంతో ఈ విధానాన్ని రాష్ట్రంలోని 7 జిల్లాలకు విస్తరించాలని సర్కారు నిర్ణయించింది. వికారాబాద్ జిల్లా సైతం ఈ కార్యక్రమం అమలుకు ఎంపికైంది. ఇందుకు సంబంధించి స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలామృతం ప్లస్ను అందించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. త్వరలోనే వికారాబాద్ జిల్లా పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల్లో చదువుకుంటున్న చిన్నారులకు బాలామృతం ప్లస్ అందించనున్నారు. వికారాబాద్ జిల్లా పరిధిలో 1106 అంగన్వాడీ కేంద్రాలుండగా 7 నెలల నుంచి 3 సంవత్సరాల లోపు పిల్లలు 33,639 మంది, 3 నుంచి 6 ఏండ్లలోపు వయస్సు వారు 21,176 మంది ఉన్నారు. జాతీయ కుటుంబ సర్వే ప్రకారం వికారాబాద్ జిల్లాలో రక్తహీనత స్థాయి 61.00 ఉన్నట్లు తేలింది. బలవర్ధకమైన పోషకాహారంతో రక్తహీనత సమస్య నివారించవచ్చు.
చిన్నారులకు బాలామృతం ప్లస్..
వయసుకు తగ్గ బరువు, ఎదుగుదల లేకపోవడంతోపాటు పిల్లల్లో ఆకలి లేకపోవడం, శరీరం పాలిపోయినట్లుగా ఉండడం, ఆకలి సన్నగిల్లడం, విసర్జన వ్యవస్థ సరిగా లేకపోవడం, మరుగుజ్జుతనంతో ఉండడం తదితర లక్షణాలతో ఇబ్బందులు పడుతున్న చిన్నారులకు బాలామృతం ప్లస్ అందించనున్నారు. ప్రతినెల అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల ఎత్తు, బరువు పరిశీలించి పోషణ్ ట్రాకర్ ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. ఈ వివరాలన్నీ ప్రతినెలా నేరుగా రాష్ట్రస్థాయి కార్యాలయానికి పంపిస్తుండడంతో వారి వివరాల ఆధారంగా బాలామృతం ప్లస్ను అందించనున్నారు. వికారాబాద్ జిల్లా పరిధిలోని కొడంగల్ ప్రాజెక్టులోని 234 అంగన్వాడీ కేంద్రాల్లో 7 నెలల నుంచి 3 సంవత్సరాలలోపు పిల్లలు 5376 మంది, 3 నుంచి 6 సంవత్సరాల లోపు వారు 4535 మంది, మర్పల్లి ప్రాజెక్టులోని 148 అంగన్వాడీ కేంద్రాల్లో 7 నెలల నుంచి 3 సంవత్సరాలలోపు పిల్లలు 4880 మంది 3 నుంచి 6 ఏండ్లలోపు వారు 2514మంది, పరిగి ప్రాజెక్టులోని 213 అంగన్వాడీ కేంద్రాల్లో 7 నెలల నుంచి 3ఏండ్ల లోపు పిల్లలు 5904 మంది, 3 నుంచి 6 ఏండ్లలోపు వారు 3068 మంది, తాండూరు ప్రాజెక్టులోని 279 అంగన్వాడీ కేంద్రాల్లో 7 నెలల నుంచి 3ఏండ్లలోపు వారు 9861 మంది, 3 నుంచి 6 ఏండ్లలోపు వారు 6364 మంది, వికారాబాద్ ప్రాజెక్టులోని 232 అంగన్వాడీ కేంద్రాల్లో 7 నెలల నుంచి 3ఏండ్ల లోపు పిల్లలు 7618 మంది, 3 నుంచి 6 ఏండ్లలోపు వారు 4695 మంది ఉన్నారు.
బలమైన పోషక విలువలతో కూడిన ఆహారం..
ప్రభుత్వం ప్రతి అంగన్వాడీ కేంద్రంలో బాలామృతం అందజేస్తుండగా ఎదుగుదల లేని, బరువు తక్కువగా ఉన్న పిల్లల ఎదుగుదల కోసం బాలామృతం ప్లస్ను అందించనున్నది. జాతీయ కుటుంబ సర్వే-5 ప్రకారం రక్తహీనతతోపాటు చిన్నారుల్లో ఎత్తుకు తగ్గ బరువు, పొడవు తదితర అంశాల్లో వ్యత్యాసం ఉందని తేలింది. ప్రధానంగా గిరిజన, ఆదివాసీ ఆడబిడ్డల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉందని గ్రహించి ప్రభుత్వం చిన్నారుల ఆరోగ్య పరిరక్షణ కోసం బాలామృతం ప్లస్ పేరిట బలమైన పోషక విలువలు గల ఆహారం అందించనున్నది. 6ఏండ్లలోపు వయసు గల వారికి బాలామృతం ప్లస్ అందిస్తారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే సీడీపీవోలకు శిక్షణ పూర్తయింది. త్వరలోనే అంగన్వాడీ సూపర్వైజర్, అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. అతి తీవ్ర లోప పోషణ (ఎస్ఎఎం), తక్కువ లోప పోషణ(ఎంఎఎం) అనే రెండు క్యాటగిరిలుగా విభజించి చిన్నారులకు బాలామృతం ప్లస్ను అందిస్తారు.
జిల్లా పరిధిలోని కొన్ని అంగన్వాడీ కేంద్రాలకు జూన్ నెలలోనే బాలామృతం ప్లస్ సైతం సరఫరా చేసినట్లు సమాచారం. తద్వారా ఆయా అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ్ ట్రాకర్లో నమోదు చేసిన వివరాల ఆధారంగా వయసుకు తగ్గ ఎత్తు, బరువు లేని పిల్లలకు అందజేశారు. ప్రతినెల చిన్నారుల ఎత్తు, బరువు కొలవడం ద్వారా ఎవరెవరికీ బాలామృతం ప్లస్ అవసరమనేది గుర్తించి అందుకు అనుగుణంగా నేరుగా పంపిణీ చేస్తారు. ప్రతినెలా చిన్నారుల ఎత్తు, బరువులు కొలిచి పోషణ్ ట్రాకర్లో నమోదు చేస్తారు. ఇప్పటికే అన్ని అంగన్వాడీ కేంద్రాల కార్యకర్తలకు స్మార్ట్ఫోన్లు అందజేయడంతో వాటి ద్వారా సమాచారం ఆన్లైన్లో నమోదు చేస్తారు. దీంతో ఏ కేంద్రం సంబంధించిన వివరాలు కావాలంటే వాటిని రాష్ట్రస్థాయి అధికారులు నేరుగా పరిశీలించేందుకు అవకాశం ఉంటుంది.