పరిగి, జూన్ 22 : కులవృత్తులకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు సీఎం కేసీఆర్ నేతృత్వంలోని సర్కారు కృషి చేస్తున్నది. కులవృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారికి తోడ్పాటు అందించడం ద్వారా వారు ఆర్థిక ప్రగతి సాధించడంతోపాటు ఉత్పత్తులను పెంచడం లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నది. ఇందుకుగాను త్వరలోనే రెండో విడుత గొర్రెలు పంపిణీ చేసేందుకు పశుసంవర్ధక శాఖ అధికారులు ఏర్పాట్లు చేపడుతున్నారు. మొదటి విడుతలో అందజేసిన గొర్రెలు పెద్దవై, వాటి పిల్లలతోపాటు మాంసం ఉత్పత్తులు గణనీయంగా పెరుగడంతో గొర్రెల పెంపకందారులు ఆర్థికంగా అభివృద్ధి సాధించారు.
వికారాబాద్ జిల్లాలో మొదటి విడుతలో 10,477 యూనిట్ల గొర్రెలు పంపిణీ చేయగా.. రెండో విడుతలో జిల్లాలో 11,334 యూనిట్లను అందజేయనున్నారు. ఇందుకు సంబంధించి సంబంధిత అధికారులు కార్యాచరణ రూపొందించి అందుకనుగుణంగా కసరత్తు చేస్తున్నారు. లబ్ధిదారుల వివరాలతో కూడిన అన్ని అంశాలను ఆన్లైన్లో పొందుపరిచేలా కార్యక్రమం కొనసాగుతున్నది. గొర్రెల పంపిణీకి అవసరమైన నిధులకు సంబంధించి రుణ మంజూరుకు జాతీయ సహకార అభివృద్ధి సంస్థ(ఎన్సీడీసీ) నిర్ణయించడంతో రెండో విడుత గొర్రెల పంపిణీకి ఏర్పాట్లు చురుకుగా కొనసాగుతున్నాయి. ప్రత్యేకంగా ఏర్పాటు చేసే కమిటీల ఆధ్వర్యంలో గొర్రెలు కొనుగోలు చేపడుతారు.
జిల్లావ్యాప్తంగా 11,334 యూనిట్ల పంపిణీ
జిల్లా పరిధిలో 318 గొర్రెల పెంపకందారుల సహాయ సహకార సంఘాలుండగా వాటిలో 22050 మంది సభ్యులున్నారు. మొదటి విడుతలో 10,954 యూనిట్లకు కాంట్రిబ్యూషన్ డబ్బులు చెల్లించగా.. 10,477 యూనిట్ల గొర్రెలు(రూ.130.96 కోట్లు) పంపిణీ చేశారు. ఒక యూనిట్లో 20 గొర్రెలు, ఒక పొట్టేలు ఉంటాయి. జిల్లావ్యాప్తంగా 1,547 గొర్రెలు, 101 పొట్టేళ్లు చనిపోగా.. వాటి స్థానంలో మళ్లీ సంబంధిత లబ్ధిదారులకు అందజేశారు. రెండో విడతలో 11,334 యూనిట్ల గొర్రెల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేశారు. ఒక యూనిట్ గొర్రెలకు 402 కిలోల దాణా, రూ.500 విలువ చేసే మందులు అందజేయడంతోపాటు రవాణా చార్జీలు ప్రభుత్వం భరిస్తుంది.
యూనిట్ ధర రూ.1.75లక్షలకు పెంపు
గొర్రెలు, పొట్టేళ్ల ధరలు పెరుగడం వల్ల, అందుకనుగుణంగా ప్రభుత్వం అందజేసే గొర్రెల యూనిట్ల ధరలు పెంచింది. ప్రతి యూనిట్లో 20 గొర్రెలు, ఒక పొట్టేలు ఉంటాయి. గతంలో యూనిట్ ధర రూ.1.25లక్షలు ఉండగా ఈ ధరను రూ.1.75లక్షలకు సర్కారు పెంచింది. ఇందులో గొర్రెల పంపిణీలో యూనిట్కు అయ్యే ఖర్చులో 75శాతం ప్రభుత్వం భరిస్తుంది. లబ్ధిదారులు 25శాతం కంట్రిబ్యూషన్ చెల్లించాలి. యూనిట్ ధర రూ.1.75లక్షలకు పెంచడంతో ప్రభుత్వం రూ.1,31,250 చెల్లిస్తుండగా, లబ్ధిదారులు రూ.43,750 భరించాల్సి ఉంటుంది. జిల్లావ్యాప్తంగా రూ.198.34కోట్లు విలువ చేసే 11,334 యూనిట్ల గొర్రెలను అందజేస్తుంది.
ఈ-లాగ్లో లబ్ధిదారుల వివరాలు
రెండో విడత గొర్రెల పంపిణీకి సంబంధించి లబ్ధిదారుల వయసు, కులం, ఇతర వివరాలను పశుసంవర్ధక శాఖ అధికారులు ఈ-లాగ్ ఆన్లైన పోర్టల్లో పొందుపరుస్తున్నారు. ఇప్పటివరకు 80శాతం వరకు పొందుపరిచామన్నారు. కొద్ది రోజుల్లోనే పూర్తి చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ తర్వాత లబ్ధిదారులవారీగా గొర్రెల పంపిణీకి అవసరమైన ఇతర ఏర్పాట్లు చేపట్టనున్నారు. గొర్రెలను ఇతర ప్రాంతాల నుంచి జిల్లాలోని వివిధ ప్రాంతాలకు తరలించేందుకు రవాణా సదుపాయానికి సంబంధించి టెండర్లు పిలిచి అవసరమైన ఏర్పాట్లు చేపడుతారు. ప్రధానంగా సొసైటీల ఎన్నికలు పూర్తయిన వాటిలోని సభ్యులకే గొర్రెల పంపిణీ చేపట్టనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. సొసైటీల ఎన్నికల ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతున్నది. ఒక్కో సొసైటీవారీగా సభ్యులతో కూడిన జాబితాలు సిద్ధం చేసి సహకార ఎన్నికల అధికారులకు అందిస్తున్నారు. వాటి ఆధారంగా సొసైటీల ఎన్నికలు నిర్వహిస్తారు. వికారాబాద్ జిల్లా పరిధిలో 318 సొసైటీలు ఉండగా 130 సొసైటీలకు సంబంధించిన సభ్యుల జాబితాను సహకార శాఖ వారికి అందజేయగా ఇప్పటివరకు 50 సొసైటీల ఎన్నికలను పూర్తి చేశారు. 45 రోజుల్లో మిగతా సొసైటీల ఎన్నికలు పూర్తి చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేపడుతున్నారు. ప్రతి సభ్యుడు తమ ఆధార్కార్డు జిరాక్స్, ఫోటో అందజేయాల్సి ఉంటుంది.
ఈ-లాగ్లో వివరాల అప్లోడ్ఫ అనిల్కుమార్, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి
జిల్లాలోని సొసైటీలలోని సభ్యుల వివరాలన్నీ ఈ-లాగ్లో అప్లోడ్ చేయడం కొనసాగుతున్నది. జిల్లాలో 318 సొసైటీలుండగా 22050 మంది సభ్యులున్నారు. 80శాతం మంది సభ్యుల వివరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. మిగతావారి వివరాలు సాధ్యమైనంత త్వరగా పూర్తిచేస్తారు. రెండో విడుతకు సంబంధించి జిల్లాలో 11334 యూనిట్ల గొర్రెలు అందించనున్నారు. సొసైటీల ఎన్నికలు 45 రోజుల్లో పూర్తవుతాయి. ఎన్నికలు పూర్తయిన తర్వాత ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం గొర్రెల పంపిణీ చేపట్టడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.