పరిగి, జూన్ 5 : ప్రభుత్వం చేపడుతున్న పల్లె ప్రగతి కార్యక్రమంతో పల్లెలు ప్రగతిపథంలో పయనిస్తున్నాయని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. ఆదివారం పరిగి మండలం చిగురాల్పల్లి గ్రామంలో కలెక్టర్ నిఖిలతో కలిసి ఎమ్మెల్యే పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు. పాఠశాల ఆవరణలో మన ఊరు-మన బడి కింద చేపట్టే పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జనాభా ప్రాతిపదికన గ్రామపంచాయతీలవారీగా ప్రతినెలా నిధులు విడుదల చేస్తుండడంతో గ్రామాల్లో అభివృద్ధి జరుగుతున్నదని చెప్పారు. ప్రజలు తీసుకున్న నిర్ణయాల మేరకే కావాల్సిన పనులను చేపట్టనున్నామని ఎమ్మెల్యే తెలిపారు. చెత్త సేకరణకు ప్రతి గ్రామపంచాయతీకి ఒక ట్రాక్టర్ను కొనుగోలు చేసినట్లు చెప్పారు. ప్రతి రోజూ ఇంటింటికీ చెత్త సేకరణ చేసి డంపింగ్యార్డుల్లో వేయడం ద్వారా గ్రామాలు పరిశుభ్రంగా మారాయన్నారు. ప్రభుత్వం అమలుచేస్తున్న ఏదో ఒక సంక్షేమ పథకం ప్రతి ఇంటికి లబ్ధి చేకూరుస్తున్నదని తెలిపారు.
ఈ సంవత్సరం నుంచే ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధన
విద్యా వ్యవస్థలో మార్పు తీసుకువచ్చి ఏ విద్యార్థీ చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో మన ఊరు-మన బడి కార్యక్రమం కింద పాఠశాలల్లో 12 అంశాల్లో సదుపాయాలు కల్పించడంతోపాటు ఈ సంవత్సరం నుంచే ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేపట్టిందని చెప్పారు. చిగురాల్పల్లి గ్రామానికి రూ.50లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టారన్నారు. మరికొంత భాగం రోడ్డు పనులు చేపట్టాల్సి ఉందని, కలెక్టర్ కొన్ని నిధులు కేటాయించినట్లు తెలిపారు.
భగీరథ నీటిని తాగితే ఆరోగ్యపరంగా మేలు
వికారాబాద్ కలెక్టర్ నిఖిల మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మిషన్ భగీరథ నీటిని తాగాలని, తానూ నీటిని తాగుతున్నానని తెలిపారు. భగీరథ నీటిని తాగడం వల్ల ఆరోగ్యపరంగా ఎంతో మేలు కలుగుతుందన్నారు. వాటర్ ట్యాంకులను ప్రతి పది రోజులకోసారి శుభ్రం చేయాలన్నారు. గ్రామంలో ఎప్పటికప్పుడు పారిశుధ్య పనులు చేపడుతూ తమ సొంత ఇండ్ల వలే గ్రామాన్ని తీర్చిదిద్దుకోవాలని సూచించారు. ప్రతి ఇంటిముందు మొక్కలు నాటితే గ్రామం పచ్చదనంతో నిండిపోతుందన్నారు. గ్రామాల అభివృద్ధిలో భాగంగా తాగునీరు, విద్యుత్, ఇతర సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకాధికారులను నియమించినట్లు తెలిపారు. పల్లె ప్రగతిలో భాగంగా సమస్యలను గుర్తించేందుకు ఒక రిజిస్టర్ను ఏర్పాటు చేశారని, అందులో సత్వరమే చేయాల్సిన పనులను వెంటనే చేపట్టేందుకు వీలుంటుందని తెలిపారు. మురికినీరు రోడ్లపై ప్రవహించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గ్రామంలో క్రీడా ప్రాంగణం ఏర్పాటుకు స్థలాన్ని గుర్తించి చుట్టూ కంచె వేసి పచ్చదనంగా ఉండేలా మొక్కలు పెంచాలని సూచించారు.
ఈ సందర్భంగా చిగురాల్పల్లి గ్రామ రోడ్డు సరిహద్దులో ఎమ్మెల్యే, కలెక్టర్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా రూ.23లక్షలతో మన ఊరు-మన బడి కింద చేపట్టే పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమాల్లో ఎంపీపీ అరవిందరావు, జడ్పీటీసీ హరిప్రియ, పల్లె ప్రగతి ప్రత్యేకాధికారి ఉపేందర్, జిల్లా విద్యాశాఖ అధికారి రేణుకాదేవి, డీపీవో మల్లారెడ్డి, తహసీల్దార్ రాంబాబు, ఎంపీడీవో శేషగిరిశర్మ, సర్పంచ్ వెంకటయ్య, ఎంఈవో హరిశ్చందర్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.