వికారాబాద్ : అనుమానితుల కదలికలను గుర్తించేందుకు కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని వికారాబాద్ డీఎస్పీ సంజీవరావు తెలిపారు. గురువారం వికారాబాద్ పట్టణంలోని రాజీవ్ గృహకల్పలో ఉదయం డీఎస్పీ ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి గుర్తింపు కార్డులను పరిశీలించారు. అనుమతి పత్రాలు లేని 66ద్విచక్ర వాహనాలు, 11 ఆటోలను మహిళ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ సంజీవరావు కాలనీ ప్రజలతో మాట్లాడుతూ కాలనీల్లోని ప్రధాన రహదారిపై, ఇంటి ముందు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే, కాలనీలోకి ఎవరు వస్తున్నారూ ? ఎవరు వెళ్తున్నారనే విషయాలు తెలుసుకోవచ్చన్నారు. రాజీవ్ గృహకల్పలో చాలా వరకు ఇండ్లకు తాళాలు ఉన్నాయని, అనుమానితులుగా ఎవరైనా కనిపిస్తే పోలీసులకు సమాచారం అందివ్వాలని తెలిపారు.
వాహనాలకు సంబంధించిన సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలను పట్టుకున్నామన్నారు. వాహనానికి సంబంధించిన సరైన ధ్రువపత్రాలను తీసుకొచ్చి వాహనాలను తీసుకెళ్లాలని సూచించారు. గంజాయి, గుట్కా తదితర మత్తు పదార్థాలతో జీవితాలను పాడు చేసుకోవద్దని తెలిపారు. ఈ కార్డెన్ సెర్చ్లో 5మంది సీఐలు, 8మంది ఎస్సైలు, 85మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారని తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు మురళీ, ఆర్.నర్సింలు, సీఐలు, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది, కాలనీ వాసులు పాల్గొన్నారు.