పరిగి : పోడు భూముల పరిష్కారం కోసం గ్రామ, మండల, డివిజన్స్థాయి కమిటీలు ఏర్పాటు చేయడంతో పాటు ప్రజలకు అవగాహన కల్పించాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల సూచించారు. జిల్లాలో పోడు భూముల పరిష్కారం కోసం వివిధ స్థాయిలలో కమిటీల ఏర్పాటుపై తాసిల్దార్లు, ఎంపీడీవోలు, ప్రత్యేకాధికారులు, అటవీ శాఖ అధికారులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచ్లు, జిల్లా అధికారులకు శనివారం డీపీఆర్సీ భవనంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ సర్పంచ్ అధ్యతన రెవెన్యూ, అటవీ, గిరిజన సంక్షేమ శాఖల సిబ్బందితో పాటు ఏడుమంది గిరిజన రైతులను ఈ కమిటీలో సభ్యులుగా ఉండాలని, వారిలో ముగ్గురు మహిళలు ఉండేలా చూడాలన్నారు.
8న గ్రామసభ నిర్వహించి గ్రామంలో అటవీ హక్కుల చట్టంపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ప్రతి ఒక్కరికి దరఖాస్తు ఫారాలు అందేలా చూడాలని చెప్పారు. రెండవ రోజు గ్రామసభ నిర్వహించి రైతుల నుంచి ఫిర్యాదులు స్వీకరించాల్సిందిగా సూచించారు. అధికారులు సమన్వయంతో పనిచేసి అర్హులైన గిరిజన రైతులకు ఆర్వోఎఫ్ఆర్ హక్కు పత్రాలు పొందేలా చూడాలని పేర్కొన్నారు. గ్రామ, మండల స్థాయిలలో అవసరమైన రిజిస్టర్లు తప్పనిసరిగా నిర్వహించాల్సిందిగా చెప్పారు. జిల్లాలో 1,08,791 ఎకరాల అటవీ భూములు ఉన్నాయని, 13 మండలాల పరిధిలో గల 27 స్థలాల్లో 2,449 ఎకరాల అటవీ భూమి ఆక్రమణకు గురైందన్నారు. మరికొన్ని గ్రామాల్లో పెరిగే అవకాశం ఉందని కలెక్టర్ చెప్పారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు మోతిలాల్, చంద్రయ్య, జెడ్పీ సీఈవో జానకిరెడ్డి, జిల్లా అటవీశాఖ అధికారి వేణుమాధవరావు, గిరిజన సంక్షేమ శాఖ అధికారి కోటాజీ, వికారాబాద్, తాండూరు ఆర్డీవోలు ఉపేందర్రెడ్డి, అశోక్కుమార్, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మండలాల ప్రత్యేకాధికారులు, అటవీ శాఖ అధికారులు, ఎంపీడీవోలు, తాసిల్దార్లు పాల్గొన్నారు.