వికారాబాద్, మార్చి 25, (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ దవాఖానలో అధునాతన టెస్టింగ్ పరికరాలను అమర్చాలని వికారాబాద్ కలెక్టర్ పౌసుమి బసు వైద్య అధికారులను ఆదేశించారు. గురువారం ప్రభుత్వ దవాఖానను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. టెస్టింగ్ పరికరాలను వెంటనే వినియోగంలోకి తీసుకురావాలని, అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని వైద్య అధికారులను ఆదేశించారు. అవసరమైన విద్యుత్ సదుపాయాలు కల్పించాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. అనంతరం ఓపీ విభాగాన్ని సందర్శించి వైద్య సేవలను పరిశీలించారు. బాలింతలకు, చికిత్సలకు కోసం భర్తీ అయిన వారి కోసం అందిస్తున్న పౌష్టికాహారం మెనూను పరిశీలించారు. వంట కోసం కొత్తగా టెండర్లను పిలువాలని సూచించారు. అనంతరం వికారాబాద్ పట్టణంలోని ఎస్ఏపీ కళాశాల వద్ద నిర్మించిన 100 పడకల ఏరియా దవాఖానను పరిశీలించారు. వైద్య పరికరాలు, అంతర్గత పనులు, కాంపౌండ్ వాల్ తదితర పనులు వెంటనే పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. కలెక్టర్ వెంట జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి సుధాకర్ షిండే, డాక్టర్ బిజిలిల్, డాక్టర్ యాదయ్య, టీఎస్ఎంఎస్ఐడీసీ డీఈ రవీందర్, ల్యాబ్ టెక్నీషియన్ ఉన్నారు.