MLA Komatireddy | జనగామ : అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నికల కోడ్ను లెక్క చేయడం లేదు. ఎన్నికల సంఘం నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. ఓటర్లను ప్రలోభపెట్టే కార్యక్రమాల్లో పాల్గొంటూ, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు.
తాజాగా జనగామలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎన్నికల కోడ్ను కాదని, ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. జనగామ వైష్ణవి గార్డెన్స్లో కుట్టు మెషీన్ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి. ఈ కార్యక్రమంలో భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి, జనగామ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు ఏప్రిల్ 29న సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. దీంతో స్థానిక బీఆర్ఎస్ నేతలు స్పందించారు. కాంగ్రెస్ నాయకులు ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని పేర్కొంటూ, ఆధారాలతో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీనిపై పూర్తి స్థాయి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను బీఆర్ఎస్ నాయకులు కోరారు.