ఆయన ఆశయ సాధనకు అనుగుణంగా సీఎం కేసీఆర్ పాలన
విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి
విద్యాభివృద్ధికి ప్రభుత్వం కృషి
250 గురుకుల విద్యార్థులకు ఎంబీబీఎస్ సీటు..
అన్నదాతల సమస్యల పరిష్కార వేదికగా రైతువేదికలు
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలపై సీఎం ప్రత్యేక దృష్టి
నియోజవర్గంలో లక్షా 50వేల ఎకరాలకు సాగునీరు
కొడంగల్, ఏప్రిల్ 14 : అంబేద్కర్ అందరివాడు అని, ఆయన ఆశయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ పాలన కొనసాగిస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని అంబేద్కర్ కూడలిలో అంబేద్కర్ విగ్రహానికి ఆమె పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. అనంతరం స్థానిక మార్కెట్యార్డ్లో 60 టన్నుల సామర్థ్యంగల వే బ్రిడ్జిని, చిట్లపల్లి, టేకల్కోడ్, హస్నాబాద్ గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహాలతో పాటు రైతువేదికలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అంబేద్కర్ అన్ని వర్గాల అభ్యున్నతిని దృష్టిలో ఉంచుకొని రాజ్యాంగాన్ని రూపొందించారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలవారు చదువుల్లో రాణించినప్పుడే దేశ పురోగతి సాధ్యపడుతుందన్నారు. కార్పొరేట్కు దీటుగా గురుకులాల్లో నాణ్యమైన విద్య అందుతుందని, 250 మంది గురుకులాల విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లను సాధించడమే అందుకు నిదర్శనమన్నారు.
పేద విద్యార్థులు విదేశాల్లో విద్యను అభ్యసించేందుకు ప్రత్యేకంగా ఓవర్సీస్ స్కాలర్షిప్ను అందిస్తున్నట్లు తెలిపారు. ఈ స్కాలర్షిప్తో రాష్ట్రంలోని దాదాపు 650 మంది విద్యార్థులు విదేశాల్లో చదువుతున్నారని తెలిపారు. తెలంగాణను అన్నపూర్ణగా తీర్చిదిద్ధే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. అన్నదాతల అభ్యున్నతికి రైతుబీమా, రైతుబంధు, కొనుగోలు కేంద్రాల ద్వారా మద్దతు ధర వంటి పథకాలు అమలు చేస్తుందన్నారు. అన్నదాత సమస్యల పరిష్కార వేదికగా రైతువేదికలు వర్ధిల్లుతున్నాయని, రాష్ట్రంలో 6 నెలల్లో 2500 రైతువేదికలు నిర్మించినట్లు తెలిపారు. సమైక్యపాలనలో దండగన్న వ్యవసాయం.. నేడు పండుగలా మారిందన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లు ప్రత్యేకంగా కొడంగల్ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నారన్నారు. కాళేశ్వరం తరహాలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ విషయమై ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలతో నియోజకవర్గానికి లక్షా 50వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
రైతు అభ్యున్నతి కోసమే రైతు వేదికలు..
ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనకు అందరం కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. ఆయన రూపొందించిన రాజ్యాంగం వల్లే నేడు ప్రజలు స్వేచ్ఛాయుత జీవితాన్ని అనుభవిస్తున్నట్లు పేర్కొన్నారు. రైతు అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ రైతు వేదికలను నిర్మించారన్నారు. వ్యవసాయానికి సంబంధించిన అన్ని అంశాలపై రైతులు చర్చించుకునేంందుకు ఈ వేదికలు ఉపయోగపడుతాయన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ విజయ్కుమార్, ఎంపీపీ ముద్దప్ప దేశ్ముఖ్, మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్రెడ్డి, వైస్ చైర్మన్ ఉషారాణి, పీఏసీఎస్ చైర్మన్ కటకం శివకుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ జ్యోతికిషన్రాథోడ్, వైస్ చైర్మన్ భీములు, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు బస్వరాజ్, సర్పంచ్లు పకీరప్ప, వెంకట్రెడ్డి, గుండప్ప, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ కృష్ణ, జిల్లా ఆదనపు కలెక్టర్ మోతీలాల్, ఆర్డ్డీవో సంతోష్, ఏడీఏ వినయ్కుమార్, ఏవో బాలాజీ ప్రసాద్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గోడల రాంరెడ్డి, అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు తదతరులు పాల్గొన్నారు.