వికారాబాద్, ఏప్రిల్ 14 : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తత్వం దేశానికి ఆదర్శమని, ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ పౌసుమిబసుతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
నవాబుపేటలో..
వికారాబాద్ జిల్లా నవాబుపేటలో జడ్పీటీసీ జయమ్మ, ఎంపీపీ భవాని, పీఏసీఎస్ చైర్మన్ పోలీసు రాంరెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ 130వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ అంబేద్కర్ అడుగుజాడల్లో నడుచుకోవాలని తెలిపారు.
ఏకేఆర్ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో..
వికారాబాద్ పట్టణంలోని ఏకేఆర్ స్టడీ సర్కిల్ డైరెక్టర్ వెంకటరమణ మాట్లాడుతూ.. ప్రపంచ మేధావి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని కొనియాడారు.
వీడీడీఎఫ్ ఆధ్వర్యంలో..
వికారాబాద్లో వీడీడీఎఫ్ ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. భారత రాజ్యాంగ నిర్మాత, మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి, ఆర్థిక సంస్కర్తగా ప్రపంచంలోనే గొప్ప పేరును సంపాదించుకున్న మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు.
ధారూరు మండలంలో..
ధారూరు, ఏప్రిల్ 14 : ధారూరు మండల పరిధిలోని నాగసముందర్, అంతారం, నాగారం, మైలారం, మోమిన్కలాన్, తరిగోపుల, హరిదాస్పల్లి, కెరెళ్లి, మున్నూర్సోమారం, బాచారం తదితర గ్రామాల్లో నాయకులు, యువజన సంఘల నాయకులు అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు.
అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం
దౌల్తాబాద్, ఏప్రిల్ 14 : ఎలాంటి వివక్ష లేని సమాజ నిర్మాణమే ధ్యేయంగా దళిత బడుగు బలహీన వర్గాల కోసం అంబేద్కర్ చేసిన కృషి అమోఘమని, రాజ్యాంగం ద్వారా భావితరానికి దిశనిర్దేశం చేసిన మహానుభావుడని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని దేవర్ఫస్లవాద్ అంబేద్కర్ విగ్రహ కమిటీ అధ్యక్షుడు నారాయణ, సర్పంచ్ మల్లేశ్వరి, బీజేపీ నాయకుడు కూర వెంకటయ్య అన్నారు. దేవర్ఫస్లవాద్, గోకఫస్లవాద్, దౌల్తాబాద్, సురైపల్లి, చెల్లాపూర్, పోల్కంపల్లి, బాలంపేట గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు.
అంబేద్కర్ ఆలోచన విధానమే నేడు అవసరం
బంట్వారం, ఏప్రిల్ 14 : భారతదేశానికి ఎప్పటికైనా అంబేద్కర్ ఆలోచన విధానమే ఎంతో అవసరం ఉందని పలువురు నాయకులు ఖాజాపాషా, కుమ్మరి నర్సింహులు, చిరంజీవి, తౌఫిక్ పాషా పేర్కొన్నారు. మండల కేంద్రంతోపాటు, తొరుమామిడి, కుంచావరం, మద్వాపూర్, బొపునారం, బస్వాపూర్, సల్బత్తాపూర్, రొంపల్లి గ్రామాల్లోని ఆయన విగ్రహాలు, చిత్రపటాలకు నివాళులర్పించారు.
బొంరాస్పేట మండలంలో..
బొంరాస్పేట, ఏప్రిల్ 14 : మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో అంబేద్కర్ విగ్రహానికి ఎంఈవో రాంరెడ్డి, వైద్యాధికారి రవీంద్రయాదవ్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రవీందర్గౌడ్, సీఐటీయూ జిల్లా నాయకుడు బుస్స చంద్రయ్య నివాళులర్పించారు. బొంరాస్పేట భూలక్ష్మి దేవాలయం చౌరస్తాలో, మండలంలోని వివిధ గ్రామాల్లో దళిత, ప్రజా సంఘాలు, అంబేద్కర్ యువజన సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడారు.
మర్పల్లి మండలంలో..
మర్పల్లి, ఏప్రిల్ 14 : మండల కేంద్రంతోపాటు కోట్మర్పల్లి, పట్లూర్, సిరిపురం, కల్ఖోడ, రావులపల్లి, పెద్దాపూర్, పంచలింగాల్, బిల్కల్ గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహాలు, చిత్రపటాలకు నివాళులర్పించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ లలిత, ఎంపీడీవో సురేశ్బాబు, వైస్ ఎంపీపీ మోహన్రెడ్డి సిబ్బందితో కలిసి నివాళులర్పించారు. ప్రతి గ్రామంలో అంబేద్కర్ ఆలోచన విధానాన్ని తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు.
కోట్పల్లి మండలంలో..
కోట్పల్లి, ఏప్రిల్ 14 : కోట్పల్లి బస్టాండ్లో నిర్వహించిన కార్యక్రమానికి తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి హాజరై.. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అంబేద్కర్ ఓటు హక్కును కల్పించి పాలనా సౌలభ్యాన్ని అందించిన వ్యక్తి అని, ఆయన ఆశయాలను యువత పాటించి దేశ అభివృద్ధికి పాటుపడాలన్నారు.