వికారాబాద్, జూలై 8, (నమస్తే తెలంగాణ): రేషన్ కార్డులు పొందేందుకు అర్హత ఉన్నవారి లెక్కతేలింది. గత నాలుగేండ్లుగా కొత్త కార్డులు మంజూరు చేయకపోవడంతో కొత్త కార్డుల కోసం ఎదురు చూశారు. కాగా.. ఇటీవల ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు అందిస్తామని ప్రకటించడంతో గడిచిన కొద్ది రోజులుగా రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ అధికారులు దరఖాస్తులు పరిశీలిస్తున్నారు. దీంతో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నవారిలో ఆశలు చిగురిస్తున్నాయి. రూ.1కిలో బియ్యంతో పాటు అనేక సంక్షేమ పథకాలు పొందాలంటే రేషన్ కార్డే కీలకంగా పనిచేస్తుంది. జిల్లాలో తెల్ల రేషన్ కార్డుల కోసం 7424 మంది దరఖాస్తు చేసుకోగా.. ఇందులో వివిధ కారణాలతో 651 దరఖాస్తులను తిరస్కరించారు. 6677 మంది అర్హులుగా గుర్తించి ఆమోదించారు. ఇంకా 96 మందికి సంబంధించి విచారణలో ఉన్నాయి.
588 రేషన్ దుకాణాలు ..2,34,500 రేషన్ కార్డులు..
వికారాబాద్ జిల్లాలో 588 రేషన్ దుకాణాలున్నాయి. వీటి పరిధిలో అన్ని రకాల కార్డులు కలిపి మొత్తం 2,34,500 ఉన్నాయి. కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో 2015 నుంచి కొత్త కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆరోగ్యశ్రీతో పాటు ధ్రువపత్రాలు, ఇతర అవసరాలకు రేషన్ కార్డు తప్పని సరి కావడంతో తమకు కార్డులు మంజూరు చేయాలంటూ తహసీల్దార్కు విజ్ఞప్తులు చేసుకున్నారు. అయితే కార్డుల మంజూరుపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో ఆయా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ఇటీవల కొత్త కార్డులు మంజూరు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేయడంతో రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ అధికారులు దరఖాస్తుల విచారణ పనులు దాదాపుగా పూర్తి చేశారు.
ఎన్ఐసీ ఐటీ విచారణలో6677 మంది అర్హులుగా గుర్తింపు
దరఖాస్తుదారుల్లో అర్హులైన వారిని గుర్తించడం కోసం విచారణ చేసేందుకు ప్రభుత్వ ఎన్ఐసీ ఐటీ సంస్థను నియమించింది. మొదట దరఖాస్తులను పరిశీలించి ఆధార్ కార్డు ద్వారా విచారణ చేశారు. అందులో కారు, ట్రాక్టర్, భూమి ఉన్నట్లు తేలినా, దరఖాస్తుదారులు మృతిచెందినా వాటిని తిరస్కరించారు. రేషన్కార్డుల కోసం జిల్లావ్యాప్తంగా 7424 మంది దరఖాస్తు చేసుకోగా, ఎన్ఐసీ ఐటీ విచారణలో 6773 మంది అర్హులుగా గుర్తించారు. 651 దరఖాస్తులను తిరస్కరించారు. ఈ 7424 దరఖాస్తులను తిరిగి ఆర్ఐ, తహసీల్దార్లు క్షేత్రస్థాయిలో విచారణ చేయగా.. గురువారం నాటికి 6677 అర్హత కలిగినవిగా గుర్తించారు. 96 దరఖాస్తులు విచారణ దశలో ఉన్నాయి. మిగతా దరఖాస్తులను జిల్లా పౌరసరఫరాల శాఖ కార్యాలయంలో అర్హత కలిగిన వాటిగా ఆమోదించనున్నారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు కార్డులు అందిస్తాం
రేషన్ కార్డులకు సంబంధించిన విచారణ ప్రక్రియ క్షేత్రస్థాయిలో కొనసాగుతున్నది. విచారణ పూర్తయి అర్హులుగా గుర్తించిన దరఖాస్తులను మాకు అందిస్తున్నారు. మా వద్ద దరఖాస్తులను ఎప్పటికప్పుడు ఆమోదిస్తున్నాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు అర్హులైన వారికి రేషన్ కార్డులు అందిస్తాం. ఇంకా మార్గదర్శకాలు అందలేదు.