బొంరాస్పేట : కుష్ఠు వ్యాధి లక్షణాలు ఉన్నవారు పరీక్షలు చేయించుకుని మందులు వాడాలని క్షయవ్యాధి నియంత్రణ జిల్లా అధికారి రవీంద్రయాదవ్ అన్నారు. గురువారం మండలంలోని నాందార్పూర్ గ్రామంలో నిర్ధారణ శిబిరం నిర్వహించి అనుమానితులకు పరీక్షలు చేశారు. 60మందికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయగా ఇద్దరికి వ్యాధి సోకినట్లు తెలింది. వారికి ఆయన మందులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ రవీంద్ర యాదవ్ మాట్లాడుతూ శరీరంపై మొద్దుబారిన మచ్చలు ఉన్నవారు తప్పక కుష్టువ్యాధి పరీక్షలు చేయించుకోవాలని, వైద్య సిబ్బంది అందించే మందులను వాడాలని సూచించారు. వ్యాధి వలన అవయవ లోపం ఏర్పడుతుందని, వీరికి ప్రభుత్వ దవాఖానలో ఉచితంగా శస్త్ర చికిత్సలు చేస్తారని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో డీపీఎంవో ఈశ్వరయ్య, పీహెచ్సీ హెల్త్ ఎడ్యుకేటర్ భాస్కరాచారి, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.