పరిగి : రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా వరి ధాన్యం కొనుగోలుకు పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లోని తన ఛాంబర్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ వానాకాలం పంట కోతలు మొదలైనందున రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేసేందుకు పీఏసీఎస్, ఐకేపీ, డీసీఎంఎస్, మార్కెటింగ్ శాఖల ఆధ్వర్యంలో 192 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు. ఈసారి వికారాబాద్ జిల్లాలో రెండు లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం వస్తుందని అంచనా వేయడం జరిగిందని చెప్పారు. అందుకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాల్లో తూకం యంత్రాలు, ఖాళీ బస్తాలు, టార్బాలిన్లు, తేమను కొలిచే యంత్రాలు, ప్యాడీ క్లీనర్లు అందుబాటులో ఉంచాల్సిందిగా సూచించారు. నవంబర్ 15వ తేదీ నుంచి 70రోజులలో వరి ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలన్నారు.
రవాణ ఇబ్బందులు లేకుండా రవాణ శాఖ అధికారులు పూర్తి సహకారం అందిస్తారని అదనపు కలెక్టర్ చెప్పారు. ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా ధాన్యం రాకుండా రెవెన్యూ, పోలీసు, వ్యవసాయ శాఖల అధికారులు చెక్పోస్టుల వద్ద కట్టడి చేయాలన్నారు. రైతులకు 24గంటల లోపు చెల్లింపులు జరిగే విధంగా రైతుల ఆధార్కార్డు, బ్యాంకు ఖాతా నంబర్ వివరాలను ఆన్లైన్లో సరిగ్గా నమోదు చేయాలని సూచించారు. మేలు రకం వరి ధాన్యానికి క్వింటాలుకు రూ. 1960, సాధారణ రకం రూ. 1940లు మద్దతు ధర లభిస్తుందని, రైతులు నాణ్యమైన ధాన్యం తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా అడిషనల్ ఎస్పీ రషీద్, డీసీఎస్వో రాజేశ్వర్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోపాల్, డీసీఎంఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి, పౌర సరఫరాల శాఖ డీఎం విమల, డీసీవో సుజాత, అదనపు డీఆర్డీవో నర్సింహులు, తాండూరు మార్కెట్ చైర్మన్ విఠల్నాయక్, ఆర్ఐలు, మార్కెటింగ్ సెక్రెటరీలు పాల్గొన్నారు.