వికారాబాద్ : ప్రజా ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ చెప్పారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 185 ఫిర్యాదులు వచ్చాయి. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. అర్జీలకు ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను వెంటవెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భూ సమస్య లు, పెన్షన్లకు సంబంధించి ఫిర్యాదులు సమర్పించారన్నారు. ప్రజా ఫిర్యాదులను సంబంధిత అధికారులు పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఫిర్యాదులపై చేపట్టిన చర్యలను వివరిస్తూ ఫిర్యాదుదారులకు సమాచారం తెలియజేయాలని సూచించారు.
ఈ ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు లింగ్యా నాయక్, సుధీర్, ఆర్డీవో వాసుచంద్ర, వివిధ శాఖల జిల్లా అధికారులు, సెక్షన్ సూపరింటెండెంట్స్ తదితరులు పాల్గొన్నారు.