బడంగ్పేట : పార్లమెంట్ ఎన్నికల్లో తనను గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందిస్తానని చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి (BRS candidate) కాసాని జ్ఞానేశ్వర్(Kasani Gnaneshwar) ముదిరాజ్ అన్నారు. మహేశ్వరం నియోజక వర్గం మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లెలగూడ సామ యాదిరెడ్డి గార్డెన్లో చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు.
మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్ (KCR) నాపై నమ్మకంతో అభ్యర్థిగా అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కాసానికి టికెట్ ఇస్తే కష్ట పడి పనిచేసి గెలిపించుకుంటామని ఎమ్మెల్యేలు పి సబితా ఇంద్రారెడ్డి, ప్రకాశ్గౌడ్, కాలే యాదయ్యలు సంపూర్ణంగా మద్దతు ప్రకటించి అన్ని రకాలుగా సహకరిస్తున్నారని పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తల శ్రమవల్లే అభ్యర్థుల గెలుపు సాధ్యమవుతుందని వెల్లడించారు. పార్టీకి కార్యకర్తలే పట్టుగొమ్మలని అన్నారు. గతంలో జడ్పీ చైర్మన్గా, ఎమ్మెల్సీగా పనిచేసి నియోజకవర్గాల అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారనని వివరించారు.
సమావేశానికి అధ్యక్షత వహించిన ఎమ్మెల్యే పి సబితా ఇంద్రారెడ్డి(MLA Sabitha) మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth reddy) అహంకారపూరితంగా మాట్లాడుతున్నారని మండి పడ్డారు. మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్పై చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత కరెంటు కోతలు, పంటలకు నీళ్లు అందించలేక ఎండబెట్టుతున్నారని, రైతుబంధు ఇవ్వడం లేదని ఆరోపించారు. ఇదే మార్పును కాంగ్రెస్ కోరుకుందా అంటూ ఆమె ప్రశ్నించారు.
మిషన్ భగీరథతో ఇంటింటికి నీళ్లు అందించిన ఘనత కేసీఆర్దేనని పేర్కొన్నారు. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి ఎవరో ఇక్కడి ప్రజలకు తెలియదన్నారు. అలాంటి వ్యక్తికి కేసీఆర్ గొప్ప అవకాశం కల్పిస్తే మోసం చేశాడని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో రంజిత్రెడ్డికి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేలు ప్రకాశ్ గౌడ్, కాలే యాదయ్య, ఎమ్మెల్సీలు ఎగ్గెమల్లేశం, వాణి దేవి, దయానంద్ గుప్తా, డీసీఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.