పరిగి, జనవరి 24 : సరిగ్గా సంవత్సర కాలంలో నష్టాలను పూడ్చుకుంటూ లాభాల్లోకి అడుగు పెట్టింది టీఎస్ ఆర్టీసీ పరిగి డిపో. వికారాబాద్ జిల్లాలో పరిగి, వికారాబాద్, తాండూరు ఆర్టీసీ డిపోలుండగా మూడింటిలోనూ చక్కటి ఆదాయం, లాభాలతో పరిగి డిపో ముందు వరుసలో నిలిచింది. ఉద్యోగులందరూ సమిష్టిగా పనిచేసి నష్టాలను అధిగమించడంతోపాటు రూ.2.46 కోట్ల లాభాలను సాధించి పెట్టడంద్వారా రాష్ట్రస్థాయిలో పరిగి ఆర్టీసీ డిపో గుర్తింపు తెచ్చుకుంది. ఇదే లాభాల పరంపర ఇకమీదట సైతం కొనసాగేలా డిపో ఉద్యోగులు మరింత చక్కగా పనిచేసేందుకు కంకణం కట్టుకున్నారు. ఇందుకుతోడు ఉన్నతాధికారుల సూచనలు కూడా తమ డిపో లాభాల బాటలో నడిచేందుకు సహకరించిందని చెబుతున్నారు. లాభాలతోపాటు ఉత్తమ కేఎంపీఎల్ సాధించడం, ఇతర పలు అంశాల్లో కూడా ఇతర డిపోలకు పరిగి డిపో ఆదర్శంగా నిలిచిందని స్వయంగా సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఆపరేషన్స్) ఎ.పురుషోత్తం ప్రశంసల వర్షం కురిపించారు.
ఏడాదిలో రూ.2.46 కోట్ల లాభాలు
వికారాబాద్ జిల్లా పరిధిలో పరిగి, వికారాబాద్, తాండూరు మూడు ఆర్టీసీ డిపోలుండగా పరిగి డిపో కేవలం ఏడాది వ్యవధిలో నష్టాలను పూర్తిగా అధిగమించి లాభాలు ఆర్జించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. 2021 ఏప్రిల్ నుంచి డిసెంబర్ నెలాఖరు వరకు పరిగి డిపో రూ.11.63 కోట్లు నష్టాల్లో కొనసాగింది. డిపోలో 75 బస్సులుండగా వాటిలో 36 ఆర్టీసీ, 39 అద్దె బస్సులు ఉన్నాయి. ప్రతిరోజూ సుమారు 30వేల కిలోమీటర్లు ప్రయాణించి 23వేల మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చడం ద్వారా రోజువారీగా రూ.13లక్షల ఆదాయం వస్తున్నది. ప్రతిరోజూ ఆక్యుపెన్సీ రేషియో 70 ఉండడం గమనార్హం. ఆదాయం పెంచుకోవడం ద్వారా ప్రతిరోజూ సుమారు రూ.2లక్షలు లాభాలు వస్తున్నాయి. దీంతో 2022 ఏప్రిల్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు పరిగి డిపో రూ.11.63 కోట్ల నష్టాలను అధిగమించి రూ.2.46 కోట్లు లాభాలు ఆర్జించింది.
జిల్లాలోని తాండూరు డిపో గత డిసెంబర్ నెలాఖరు వరకు రూ.కోటీ 63 లక్షల నష్టాల్లో కొనసాగుతుండగా ఇప్పుడిప్పుడే లాభాలు వస్తున్నాయి. తాండూరు డిపోలో 86 బస్సులుండగా ప్రతిరోజూ 32వేల కిలోమీటర్లు ప్రయాణించి 22వేల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి.
వికారాబాద్ డిపో కూడా గత డిసెంబర్ వరకు రూ.91 లక్షలు నష్టాల్లో ఉండగా.. జనవరి నెలలో లాభాలు వస్తున్నాయి.జనవరి 1 నుంచి 23 వరకు పరిగి డిపో రూ.30లక్షలు, వికారాబాద్ డిపో రూ.9లక్షలు, తాండూరు డిపో రూ.2లక్షలు లాభాలు ఆర్జించాయి. మూడు డిపోలను పరిశీలిస్తే పరిగి డిపో రోజువారీగా నిర్వహించే ఆల్ డిపోస్ ప్రాఫిట్ కాంపిటీషన్లో ప్రతిరోజూ లాభాలు ఆర్జిస్తున్నది. రాష్ట్రంలో 97 ఆర్టీసీ డిపోలుండగా రోజు వారీగా లాభాలు వస్తున్న అయిదారు డిపోల్లో పరిగి డిపో నిలిచిందని అధికారులు పేర్కొన్నారు. గత డిసెంబర్ నెల నుంచి టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆల్ డిపోస్ ప్రాఫిట్ కాంపిటేషన్ నిర్వహిస్తున్నారు. రోజువారీగా సంబంధిత డిపో ఎంత ఆదాయం తీసుకువచ్చింది, రోజువారీ ఖర్చు పోనూ లాభం ఎంత వచ్చింది ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నారు. ఈ పోటీలో కూడా పరిగి డిపో జిల్లాలో ముందు వరుసలో నిలిచింది.
అందరూ ఉత్తమ ఉద్యోగులని ప్రశంసలు
పరిగి ఆర్టీసీ డిపో లాభాలతోపాటు రాష్ట్రస్థాయిలో 5.90 కేఎంపీఎల్తో ఉత్తమ డిపోగా నిలిచిందని, ఇతర విభాగాల్లో కూడా అత్యుత్తమ పనితీరుతో డిపోలో పనిచేసే ఉద్యోగులందరూ ఉత్తమ ఉద్యోగులని టీఎస్ ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పురుషోత్తం ప్రశంసించారు. ఇలాగే లాభాలు తెస్తుంటే రాబోయే రోజుల్లో మరిన్ని బస్సులు డిపోకు ఇస్తామని హామీ ఇచ్చారు. దీంతో చాలా మందికి ఉద్యోగావకాశాలు కలుగుతాయన్నారు. పరిగి చుట్టుపక్కల ఉన్న ఆర్టీసీ ఉద్యోగులందరూ ఇతర చోట్ల పనిచేసే వారిని కూడా పరిగి డిపోలో నియమించేలా కృషి చేస్తామనడం గమనార్హం. అన్ని పారామీటర్లలో పరిగి డిపో టాప్లో ఉందని ప్రశంసించారు. డిపో ఆదాయం మరింత పెంచేందుకు బస్టాండ్ పక్కన గంజ్రోడ్డులో 36 దుకాణాల నిర్మాణానికి ఇటీవలే టెండర్లు పూర్తవగా వెంటనే పనులు ప్రారంభిస్తామని ఈడీ తెలిపారు. బస్టాండ్ లోపలికి గల నడకదారిలో గల ఖాళీ స్థలంలో కూడా దుకాణాల నిర్మాణం చేపట్టి ఆదాయం పెంచేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.