ఆర్కేపురం : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు గతంలో ఎన్నడూ జరుగలేదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, మహేశ్వరం నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మంత్రి సబితాఇంద్రారెడ్డి (Minister Sabita reddy) అన్నారు. బుధవారం సరూర్నగర్ డివిజన్ పరిధిలోని హుడా కాంప్లెక్స్, చెరుకుతోట కాలనీ, సరూర్నగర్ మున్సిపల్ కార్యాలయం, సరూర్నగర్ చౌడీ, సరూర్నగర్ గాంధీబొమ్మ, భగత్సింగ్నగర్లో ఆమె నిర్వహించిన రోడ్ షో (Road Show) లకు విశేష స్పందన వచ్చింది.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసమే పనిచేస్తుందన్నారు. రాష్ట్రంలోని పేద, బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎదగడానికి సీఎం కేసీఆర్(CM KCR) దేశంలో ఎక్కడాలేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేశారని పేర్కొన్నారు. బస్తీలలో నివసించే ప్రజల కోసం ఇంటి ముంగిటే బస్తీ దవఖానాలు ప్రారంభించామన్నారు.
ఇప్పటికే డివిజన్ను చాలా అభివృద్ధి చేశానని, మరోసారి అవకాశం ఇస్తే డివిజన్ రూపురేఖలు పూర్తిగా మారుస్తానని చెప్పారు. గత ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన హామీతో పాటు ఇవ్వని హామీలను కూడా అమలు చేశానని గుర్తుకు చేశారు. మహేశ్వరం నియోజకవర్గం మరో హైటెక్ సిటీగా మారుతుందని, దీంతో స్థానిక యువతకు పెద్దమొత్తంలో ఉద్యోగ అవకాశాలు దొరకనున్నాయని వివరించారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పారుపల్లి అనితాదయాకర్రెడ్డి, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి బేర బాలకిషన్, నియోజకవర్గ యూత్వింగ్ మాజీ అధ్యక్షుడు లోకసాని కొండల్రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు బోయిని మహేందర్యాదవ్, డివిజన్ మాజీ అధ్యక్షుడు ఇంటూరి అంకిరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.