మూడు రోజులపాటు సామాజిక కార్యక్రమాలు
15న ఆశ్రమాల్లో పండ్లు, దుస్తుల పంపిణీ, 16న రక్తదాన శిబిరాలు 17న ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అన్నదానం..
ఏర్పాట్లు పూర్తి చేసిన పార్టీ శ్రేణులు, అభిమానులు
టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్రెడ్డి, మెతుకు ఆనంద్ ఆధ్వర్యంలో సంబురాలు
రంగారెడ్డి, ఫిబ్రవరి 14, (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు జిల్లాలో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. టీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ ప్రజాప్రతినిధులకు, నాయకులు, అభిమానులు మూడు రోజులపాటు వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు. నేటి నుంచి 17 తేదీ వరకు జిల్లా అంతటా సేవా కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించారు. సీఎం కేసీఆర్ పుట్టినరోజు సంబురాల్లో భాగంగా మంగళవారం జిల్లా అంతటా దవాఖానలు, వృద్ధులు, అనాథాశ్రమాల్లో పండ్లు, బట్టలు పంపిణీ చేయనున్నారు. 16న అన్ని మండల, మున్సిపాలిటీ కేంద్రాల్లో రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా 17న జిల్లాలోని అన్ని దేవాలయాల్లో సీఎం కేసీఆర్ పేరిట పూజలు, క్షీరాభిషేకం చేపట్టడంతోపాటు పెద్ద ఎత్తున మొక్కలు కూడా నాటనున్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి మాట్లాడుతూ సీఎం పుట్టినరోజును మూడురోజులపాటు పండుగలా జరుపుతామని స్పష్టం చేశారు. ఉద్యమ నేతగా కేసీఆర్ తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి ప్రత్యేక తెలంగాణ రాష్ర్టాన్ని సాధించారని, ప్రస్తుతం సీఎంగా రాష్ర్టాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టారన్నారు. రైతుబంధు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి ఎన్నో పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. సీఎం కేసీఆర్ జన్మదిన సంబురాల్లో టీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
వికారాబాద్ జిల్లాలో..
పరిగి, ఫిబ్రవరి 14 : సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను మూడురోజులపాటు నిర్వహించేందుకు వికారాబాద్ జిల్లా పార్టీ శ్రేణులు సైతం సిద్ధమయ్యారు. 15వ తేదీన అన్నదాన కార్యక్రమాలు, 16న అన్ని నియోజకవర్గాల్లో రక్తదాన శిబిరాలు, 17న సర్వమత ప్రార్థనలతోపాటు మొక్కలు నాటడం చేపట్టనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మూడు రోజులపాటు పలు సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు సర్వం సిద్ధం చేశామన్నారు. ఇందులో పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.