పరిగి, ఆగస్టు 2 : వికారాబాద్ జిల్లా పరిధిలో జూలై నెలలో సాధారణం కంటే 94శాతం అత్యధిక వర్షపాతం నమోదైంది. జిల్లాలోని అన్ని మండలాల్లో సాధారణ వర్షపాతం కంటే అత్యధిక వర్షపాతం నమోదవడం గమనార్హం. వికారాబాద్ జిల్లాలో జూలై నెల సరాసరి వర్షపాతం 202 మి.మీ ఉండగా.. ఈసారి 391.2 మి.మీ వర్షపాతం నమోదైంది. ధారూరు మండలంలో సాధారణం కంటే అత్యధికంగా 163 మి.మీ వర్షపాతం నమోదైంది.
జిల్లాలో అలుగు పారుతున్న 197 చెరువులు
జిల్లా పరిధిలో మొత్తం 1175 చెరువులున్నాయి. ఇందులో ఇప్పటికే 197 చెరువులు అలుగు పారుతుండగా మరో 342 చెరువులు అలుగు పారేందుకు వీలుగా నిండుకుండలా మారాయి. జిల్లాలోని చెరువుల్లో 25శాతం వరకు నీరున్న చెరువులు 105, 25-50శాతం వరకు నీరున్న చెరువులు 260, 50-75శాతం వరకు నీరున్న చెరువులు 271 ఉన్నాయి. జిల్లాలోని కొన్ని మండలాల్లోనే అత్యధికంగా వర్షాలు కురుస్తుండడంతో ఆయా ప్రాంతాల్లోని చెరువులన్నీ నీటితో నిండిపోయి అలుగు పారుతున్నాయి. మరోవైపు ఆగస్టు నెల ప్రారంభం నుంచి కూడా జిల్లాలో వర్షాలు కురుస్తుండడంతో రాబోయే కొద్ది రోజుల్లో చెరువులన్నీ నీటితో నిండనున్నాయి. జిల్లాలోని మధ్యతరహా ప్రాజెక్టు కోట్పల్లి, సర్పన్పల్లి ప్రాజెక్టు, నందివాగు ప్రాజెక్టు, శివసాగర్ ప్రాజెక్టు, అల్లాపూర్ ప్రాజెక్టులు నీటితో నిండిపోయి అలుగు పారుతున్నాయి.
రంగారెడ్డి జిల్లాలో..
జిల్లాలో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. జిల్లావ్యాప్తంగా గత రెండు రోజులుగా భారీ వర్షం కురుస్తున్నది. కరువు ప్రాంతమైన ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోనూ ఈ ఏడాది రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. అన్ని మండలాల్లో సాధారణ వర్షపాతానికి మించి వర్షపాతం నమోదు కావడం గమనార్హం. జిల్లాలో జూన్, జులై, ఆగస్టు నెలలో ఇప్పటివరకు సాధారణ వర్షపాతం 385.6 మి.మీ వర్షపాతంకాగా, ఇప్పటివరకు 496.8 మి.మీ వర్షపాతం నమోదైంది. జూన్లో సాధారణ వర్షపాతం 91.7 మి.మీ కాగా 126 మి.మీ, జూలై నెలలో సాధారణ వర్షపాతం 153 మి.మీ కాగా 346.1 మి.మీ, ఆగస్టులో 140.9 మి.మీ కాగా ఇప్పటివరకు 24.7 మి.మీ వర్షపాతం నమోదైంది. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రధాన మూసీతోపాటు ఈసీ వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. జిల్లాలోని ఇబ్రహీంపట్నం, చేవెళ్ల, షాద్నగర్ నియోజకవర్గంలోని అన్ని చెరువులు నిండుకుండలా మారి మత్తడి పోస్తున్నాయి.