తాండూరు రూరల్ : మహిళలు పొదుపుతో పాటు వ్యాపార రంగంలో కూడా రాణించాలని ఢిల్లీకి చెందిన సీనియర్ డిప్యూటీ వ్యవసాయ, మార్కెటింగ్ అధికారి అనిల్కుమార్ అన్నారు. గురువారం తాండూరు మహిళా సమాక్య కార్యాలయంలో తాండూరు, బొంరాస్పేట మహిళా సంఘాల నాయకులతో వివిధ పనిముట్ల, యంత్రాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా సమాక్యకు ప్రభుత్వం సబ్సిడీపై వివిధ పనిముట్లు, యంత్రాలు ఇస్తుందని, వీటి ద్వారా వ్యవసాయ పనులు చేసుకుంటూ వ్యాపార రంగంలో రాణించాలని సూచించారు. తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని తెలిపారు. వ్యాపారంలో ఎలా రాణించాలనే దానిపై ఎప్పటికప్పుడూ సమీక్షించుకుంటూ ముందుకు పోవాలన్నారు.
అదే విధంగా రైతులు అధిక లాభాలు వచ్చే పంటల దిగుబడిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని తెలిపారు. మహిళా రైతులకు త్వరలో వారి వ్యాపారాభివృద్ధికి శిక్షణ ఇస్తామన్నారు. మహిళాలు రాణించేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రోత్సహిస్తోందన్నారు. సమిష్టి వ్యవసాయం, ఉత్పత్తుల కొనుగోళ్లు, మార్కెటింగ్ విలువ జోడింపు కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ అధికారి రాఘవేందర్, డీపీఎం శ్రీనివాస్, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు మొగులమ్మ ఉన్నారు.