వికారాబాద్, డిసెంబర్ 8 : లింగ వివక్షత లేని సమాజం కోసం అందరూ కృషి చేయాలని వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. గురువారం వికారాబాద్లో ఏహెచ్టీయూ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అన్ని శాఖలు కలిసి నిర్వహించిన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఎన్టీఆర్ చౌరస్తా నుంచి ఎమ్మార్పీ చౌరస్తా వరకు విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల లింగ వివక్షత చూపరాదని.. మగపిల్లలతో సమానంగా ఆడపిల్లల్ని కూడా చదివించి సమాజంలో ఎదుగనివ్వాలన్నారు.
బాల్య వివాహాలను నిర్మూలించి ఆడపిల్లలపై జరుగుతున్న అన్యాయాలను అరికట్టేందుకు ప్రతిఒక్కరూ ముందుకు రావాలని సూచించారు. నవంబర్ 23 నుంచి డిసెంబర్ 23 వరకు మహిళలు, పిల్లల భద్రత విభాగం తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. మహిళలు, పిల్లలపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు హెల్ప్ లైన్ రంబర్ 100, 112, 1098లకు ఫోన్ చేసి తెలుపాలన్నారు. విద్యార్థులు, మహిళలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ ఎంఏ.రశీద్, వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ మంజుల, వికారాబాద్ డీఎస్పీ సత్యనారాయణ, సీఐ ప్రమీల, వికారాబాద్ సీఐ శ్రీను, ఏహెచ్టీయూ టీమ్ సీఐ దాసు పాల్గొన్నారు.