పెద్దేముల్ : మండలంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వందశాతం పూర్తి చేయాలని జిల్లా వైద్యాధికారి డా. తుకారంభట్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి, పలు రికార్డులను పరిశీలించారు. మండలంలో కొనసాగుతున్న కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ వివరాలను స్థానిక మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రావణ్ కుమార్రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో మొత్తం 38,120 మందికి మొదటి డోసు ఇవాల్సి ఉండగా అందులో మొత్తం 35,700 మందికి ఇప్పటి వరకు పూర్తి చేసి మొదటి డోసులో 93శాతం వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేశామన్నారు. అదే విధంగా సెకండ్ డోసులో కూడా ఈ నెల 31వరకు సుమారు 11వేల మందికి వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉందని సూచించారు.
ముఖ్యంగా మండలంలో మండలస్థాయి అధికారుల సహాయ సహకారాలతో అందరి సమన్వయంతో వ్యాక్సినేషన్ ప్రక్రియను వీలైనంత త్వరగా వందశాతం పూర్తి చేయాలన్నారు. అందుకు అవసరమైతే ఉదయం, సాయంత్రం వేరు వేరుగా శిబిరాలను ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలను పూర్తిస్థాయిలో చైతన్య పరిచి కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేసే వరకు ఎవరు కూడా విధుల్లో నిర్లక్ష్యం వహించకుండా, సమయాను సారంగా విధులు నిర్వహిస్తూ వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేసి వివరాలను పక్కగా నమోదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రావణ్ కుమార్రెడ్డి, ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.