వికారాబాద్/మోమిన్పేట : తెలంగాణ ధాన్యం కొనుగోళ్ల విషయంలో మొండి వైఖరి అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వం తీరు మార్చుకోవాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు. సోమవారం వికారాబాద్ పట్టణంలో టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు నల్ల చొక్కాలు, నల్ల బ్యాడ్జీలు, నల్ల మాస్కులు ధరించి, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి ఎన్టీఆర్ చౌరస్తా వరకు డప్పు చప్పుళ్లతో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను ఎన్టీఆర్ చౌరస్తా వరకు తీసుకొచ్చారు. రైతు చట్టాలను నిరసిస్తూ ప్లకార్డులు, నినాదాలు చేస్తూ దిష్టిబొమ్మను దహనం చేశారు.
మోమిన్పేట మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ పాడే మోస్తూ ప్రధానీ నరేంద్రమోది దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పిలుపు మేరకు, మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. రైతులు పండిస్తున్న వడ్లు కొనడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. రైతుల ఉసురు తియ్యొద్దని, రైతు వ్యతిరేక విధానాలను మార్చుకోవాలన్నారు. వడ్లు కొనే అవకాశం కేంద్రంకు ఉన్నందునా తప్పనిసరిగా వడ్డు కొని తీరాలని డిమాండ్ చేశారు.
అప్పట్లో తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వమని చెప్పిన వారి గతి ఏమైందో, వరి కొనుగోలు చేయలేని కేంద్ర ప్రభుత్వం గతికూడా అదే పడుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో టీఎస్ఈడబ్ల్యూఐడీసీ చైర్మన్ నాగేందర్గౌడ్, జడ్పీ వైస్ చైర్మన్ విజయ్కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ మంజులరమేశ్, పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి, మోమిన్పేట మండల అధ్యక్షుడు వెంకటేశం, కౌన్సిలర్లు, సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.