పెద్దేముల్ : మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలను కలెక్టర్ నిఖిల, డీఈఓ రేణుకాదేవి వేర్వేరుగా సందర్శించారు. శనివారం మండల కేంద్రంలో జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో 8,9,10వ తరగతి గదులను, కిచెన్ షెడ్ను కలెక్టర్ నిఖిల పరిశీలించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజన పట్టికను పరిశీలించి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. అంతకుముందు స్థానికంగా ఉన్న ఐఈఆర్టీ కేంద్రంతో పాటు, బాలికల పాఠశాలను పరిశీలించారు. కలెక్టర్ బాలుర ఉన్నత పాఠశాలను పరిశీలిస్తూ పాఠశాల స్థితిగతుల గురించి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం డీఈవో మాట్లాడుతూ ఉపాధ్యాయులు విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉండకుండా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలన్నారు. ముఖ్యంగా విద్యార్థుల విద్యాభివృద్ధికి ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కృషి చేయాలని కోరారు.
అంతకుముందు స్థానికంగా ఉన్న ఐఈఆర్టీ కేంద్రాన్ని సందర్శించి శనివారం హాజరైన ఇద్దరు విద్యార్థులతో మాట్లాడి కలర్ బ్లాక్స్లో నీలి రంగు, పసుపు రంగు గుర్తించాలని కోరగా ఇద్దరు విద్యార్థులు కూడా కరెక్టుగా గుర్తించడంతో వారిని అభినందించారు. అనంతరం బాలికల ఉన్నత పాఠశాలలో కొనసాగుతు న్న పాఠ్యాంశాలను పరిశీలించారు. వారి వెంట పాఠశాల ప్రధానోపాధ్యాయులు శాంతప్ప, మల్లమ్మ, ఎమ్మార్వో ఫహీం ఖాద్రి, ఎంపీఓ షేక్ సుష్మా, పంచాయతీ కార్యదర్శి సుధారాణి, ఉపాధ్యాయులు ఉన్నారు.