వికారాబాద్ : స్కూల్ బస్సు నిలిపినచోటే దగ్ధమైన సంఘటన మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసులు, స్కూల్ యాజమాన్యం తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ పట్టణంలోని న్యూ గీతాంజలి పాఠశాలకు చెందిన ఏపీ 15 వై 2580 నంబర్ గల బస్సు ఎప్పటిలాగే విద్యార్థులను ఇంటి వద్ద దింపి సోమవారం సాయంత్రం పాఠశాల సమీపంలో నిలిపారు. మంగళవారం తెల్లవారు జామున 3:30 గంటల ప్రాంతంలో బస్సులో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగి దగ్ధమవుతుండగా, గమనించిన స్థానికులు వెంటనే స్కూల్ ప్రిన్సిపాల్ చంద్రశేఖర్కు, పోలీసులకు ఫోన్ చేసి విషయం తెలిపారు.
ఫైర్ స్టేషన్కు ఫోన్ చేయడంతో వెంటనే వచ్చిన వాహనం మంటలు ఆర్పింది. అప్పటికే బస్సులోని సీట్లు పూర్తిగా కాలిపోయాయి. కాగా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. స్కూల్ యాజమాని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై లక్ష్మయ్య తెలిపారు.