వికారాబాద్, ఫిబ్రవరి 17 : 42 దొంగతనాలు.. 36 కేసుల్లో ప్రధాన నిందితుడైన అంతర్ జిల్లా దొంగను పోలీసులు, సీసీఎస్ పోలీసులు పట్టుకున్నట్లు వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. శనివారం వికారాబాద్లోని పాత పోలీస్ స్టేషన్ పరిధిలో అంతర్ జిల్లా దొంగను పట్టుకొని వివరాలు మీడియాకు తెలిపారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం కరక్కాయల గూడెంకు చెందిన ఆంజనేయులు (అంతర్ జిల్లా దొంగ) తాళం వేసిన ఇండ్లనే లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడేవాడు. అతడిని వికారాబాద్ జిల్లా పోలీస్ అధికారులు నమ్మదగిన సమాచారం మేరకు పట్టుకున్నట్లు తెలిపారు.
నవాబుపేట పోలీస్స్టేషన్ పరిధిలోని పులుమామిడి గేటు వద్ద మోమిన్పేట్ సీఐ ఆంజనేయులు, సీసీఎస్ సీఐ బలవంతయ్య, సీసీఎస్ సిబ్బంది, నవాబుపేట్ ఎస్సై భరత్ భూషణ్, సిబ్బందితో శనివారం ఫిబ్రవరి 17న ఉదయం 5 గంటల నుంచి వాహనాల తనిఖీ చేశారు. యూనికాన్ బైక్పై వచ్చిన ఒక వాహనదారుడు పోలీస్ అధికారులను చూసి పారిపోవడానికి ప్రయత్నించాడు. అతడిపై అనుమానం వచ్చి పట్టుకొని అతడి వద్ద ఉన్న బ్యాగ్ను తనిఖీ చేయగా బంగారం, వెండి ఆభరణాలు కనిపించాయన్నారు. విచారించగా నేరస్తుడు ఆంజనేయులు కరక్కాయల గూడెం, హుజూర్నగర్ మండలం, సూర్యాపేట జిల్లా అని తెలిపారన్నారు. వివిధ ప్రాంతాల్లో చోరీ చేసిన సొత్తును వికారాబాద్లో అమ్మడానికి తీసుకొని వెళుతూ పట్టుబడ్డాడని తెలిపారు.
ఫిబ్రవరి 7న రాత్రి నవాబుపేట మండలం వట్టిమీనపల్లి గ్రామం వద్ద ప్రజలెవ్వరూ లేరని గమనించి ఆ గ్రామంలో దొంగతనం చేయడం కోసం ఇంటిని వెతికాడన్నారు. ఒక ఇంటికి తాళం వేసి ఉండడం గమనించి తన వెంట తెచ్చుకున్న ఇనుపరాడ్డుతో ఆ ఇంటి తాళం విరగ్గొట్టి లోపలికి ప్రవేశించాడు. అనంతరం రెండు బీరువాల్లోని బంగారం, వెండి ఆభరణాలు, రూ.60 వేల నగదును దొంగిలించినట్లు ఒప్పుకున్నట్లు తెలిపారు.
గత సంవత్సరం డిసెంబర్ 11న వికారాబాద్లోని అస్సాం బేకరీ వద్ద ఒక ఇంటికి తాళం వేసి ఉండటాన్ని గమనించి, లోపలికి వెళ్లి డోర్ తాళాన్ని విరగ్గొట్టిట్లు తెలిపాడు. ఇంటిలోకి ప్రవేశించి కప్బోర్డ్లో ఉన్న వెండి, బంగారు ఆభరణాలను దొంగిలించాడని చెప్పారు.
ఇటీవల కాలంలోనే కోదాడ పోలీస్స్టేషన్ పరిధిలో 4 చోట్ల దొంగతనాలు చేసినట్లు నేరస్తుడు ఒప్పుకున్నట్లు పేర్కొన్నారు. ఆంజనేయులు ఇప్పటివరకు నల్గొండ జిల్లాలో 25 కేసులు, ఖమ్మం జిల్లాలో 4 కేసులు, వరంగల్ జిల్లాలో 4 కేసులు, సిద్ధిపేట జిల్లాలో 2 కేసులు, సంగారెడ్డి జిల్లాలో 1 కేసు మొత్తం 36 దొంగతనం కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చినట్లు వివరించారు.
ప్రస్తుతం ఆంజనేయులును నవాబుపేట్ పోలీస్స్టేషన్లో ఒక కేసు, వికారాబాద్ టౌన్ పోలీస్స్టేషన్లో ఒక కేసు, కోదాడ పోలీస్స్టేషన్ పరిధిలో 4 కేసులకు సంబంధించి అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. వివిధ జిల్లాల్లో ఉన్న కేసులతోపాటు ఈ 6 కేసులను కలుపుకొని మొత్తం 42 కేసులు నమోదయ్యాయన్నారు.
ఆంజనేయులు నుంచి 30.3 తులాల బంగారం, 1.40 కిలోల వెండి, మూడు బైక్లు (యూనికార్న్, గ్లామర్, రాయల్ ఎన్ఫీల్డ్)లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఇతడిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని ఎస్పీ తెలిపారు. గ్రామాలు, పట్టణాలు, ఇండ్ల ఎదుట సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే దొంగల కదలికలను బట్టి త్వరగా దొంగను పట్టుకోవచ్చని చెప్పారు. ఇందుకు సహకరించిన పోలీస్ అధికారులను, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. వారికి తగిన పారితోషకాన్ని అందజేశారు. కార్యక్రమంలో వికారాబాద్ డీఎస్పీ అంజయ్య, సీఐలు శ్రీను, ఎస్సైలు, సిబ్బంది ఉన్నారు.