కోట్పల్లి : సమస్యలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దడమే తెలంగాణ లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. శుక్రవారం మండలంలోని కొత్తపల్లి గ్రామంలో మీతో నేను కార్యక్రమంలో భాగంగా పర్యటించి, ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం చేపడుతున్న పథకాలతో ప్రజలు సంతృప్తిగా ఉన్నారా.. అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఉదయం 7గంటల నుంచి 10గంటల వరకు గ్రామంలో ఇంటింటికీ తిరిగి ప్రజలను అప్యాయంగా పలకరించారు. అవ్వలను పలకరిస్తు.. నెలనెల పింఛన్ తీసుకుంటున్నారా.. అవి ఎవరు ఇస్తున్నారని అవ్వలను అడుగగా మా పెద్ద కొడుకు కేసీఆర్ సారు పంపుతుండు అని అవ్వ చెప్పడంతో ఆయన చాలా సంతోషించారు.
గ్రామంలో అన్ని సమస్యలను గుర్తించి అనంతరం గ్రామ నడిబోడ్డున అన్ని శాఖల అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక్కో శాఖ అధికారులతో గతంలో గుర్తించిన సమస్యలను గుర్తు చేస్తు.. గతంలో విద్యుత్ సమస్యను గుర్తించడంతో అట్టి సమస్యను అధికారులు పరిష్కరించారని అందుకు విద్యుత్ ఏఈని సంబోదిస్తు ఇచ్చిన సమయంలో పని చేయడం చాలా సంతోషమని అన్నారు. అనంతరం పలు కాలనీల్లో మిషన్ భగీరథ తాగునీరు అందడం లేదని ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తేగా ఏఈ వేణుమాదవ్ను అడుగగా నెల రోజుల్లో సమస్యను పూర్తి చేసి ప్రజలకు తాగునీరు అందిస్తానని అన్నారు. అనంతరం రేషన్కార్డులు, పింఛన్లపై ప్రజలు అడుగగా త్వరలోనే రేషన్కార్డులు, పింఛన్ వంటి సమస్యలను పరిష్కరించేందుకు కేసీఆర్ సర్కార్ పని చేస్తుందన్నారు.
గ్రామంలో పాఠశాలకు కంపౌండ్ వాల్, సీసీ రోడ్డు, రైతులకు అనుకూలంగా ఉండేందుకు పార్మిషన్ రోడ్డు అవసరమని ఎమ్మెల్యేను సర్పంచ్ మల్లయ్య కోరగా సానుకూలంగా స్పందించి సంబంధించిన నిధులను అందించేందుకు కృషి చేస్తానని అన్నారు. గ్రామానికి గతంలో ఉదయం, సాయంత్రం ఆర్టీసీ బస్సు వచ్చేదని, ఇప్పుడు రావడం లేదని దీంతో ప్రజల రాకపోకలకు ఇబ్బంది అవుతుందని కోరగా ఎమ్మెల్యే ఆర్టీసీ డీఎంకు ఫోన్ ద్వారా మాట్లాడి కోట్పల్లికి వచ్చే లోకల్ బస్సును కొత్తపల్లికి ఉదయం, సాయంత్రం రావలని సూచించగా స్పందించిన డీఎం జనవరి 2వ తేది నుంచి నడిపిస్తామని అన్నారు.
కల్యాణలక్ష్మీ చెక్కుల పంపిణీ..
మండలంలోని 12 పంచాయతీలకు సంబంధించి కల్యాణలక్ష్మి, షాదీముభారక్ లబ్ధిదారులకు ఎమ్మెల్యే ఆనంద్ చేతుల మీదుగా చెక్కులను పంపిణీ చేశారు. పేదింటి ఆడబిడ్డలకు కేసీఆర్ ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఈ కానుక ఎంతో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాస్రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు అనిల్, పీఎసీఎస్ చైర్మన్ రాంచంద్రారెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రాములు, మండల సర్పంచుల సంగం అధ్యక్షుడు వెంకటేశం, సర్పంచ్ గొడ్డలి మల్లయ్య, ఎంపీడీవో లక్ష్మీనారాయణ, తాసిల్దారు అశ్పక్రసూల్, ఆయా గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.