వికారాబాద్ జిల్లాలో ఆర్టీసీకి భారీ ఆదాయం సమకూరుతున్నది. టీఎస్ఆర్టీసీ తీసుకొస్తున్న ప్రత్యేక సంస్కరణలతో బస్సులకు ప్రజాదరణ పెరిగింది. దీంతో దాదాపుగా అన్ని రూట్లు లాభాలు తెచ్చిపెడుతున్నాయి. అధికారులు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న రూట్లను గుర్తించి అదనపు సర్వీసులను నడుపుతుండడంతో మంచి రెవెన్యూ వస్తున్నది. ఏడాది క్రితం నెలకు కేవలం రూ.6 కోట్ల వరకు ఆదాయం పొందిన ఆర్టీసీ ప్రస్తుతం సుమారుగా రెట్టింపు రాబడి పొందుతున్నది. తాండూరు, వికారాబాద్, పరిగి డిపోల పరిధిలో 123 రూట్లలో ఆర్టీసీ బస్సు సర్వీసులు కొనసాగుతుండగా రోజుకు రూ.30 లక్షలకుపైనే ఆదాయం అందుతున్నది. ఈ లెక్కన నెలకు రూ.10 కోట్ల వరకు ఆదాయం వస్తున్నది. అంతేకాకుండా కార్గో సేవలతో మరో రూ.1.80కోట్ల ఆదాయం అదనంగా సమకూరుతున్నది. ప్రధానంగా పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ సర్వీసులతో ఆర్టీసీ సంస్థ అధిక లాభాలు ఆర్జిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
వికారాబాద్, అక్టోబర్ 14(నమస్తే తెలంగాణ): జిల్లాలో ఆర్టీసీ లాభాల బాటలో నడుస్తున్నది. ఏడాది క్రితం వరకు ఆశించిన స్థాయిలో ఆదాయం రాకపోయినా.. ప్రస్తుతం మాత్రం తిరిగి లాభాల బాటలో కొనసాగుతున్నది. జిల్లాలో ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించే రూట్లను గుర్తించిన ఆర్టీసీ అధికారులు అందుకు అనుగుణంగా సర్వీసులను నడుపుతుండటంతో అంచనాలకు తగినట్లుగా ఆదాయం సమకూరుతున్నది. ఏడాది క్రితం వరకు రూ.6 కో ట్ల వరకు ఆదాయాన్ని ఆర్జించిన ఆర్టీసీకి ప్రస్తుతం రూ.60 శాతానికిపైగా ఆదాయం పెరుగడం గమనా ర్హం. అయితే జిల్లాలోని తాండూరు, వికారాబాద్, పరిగి డిపోల పరిధిలో 123 రూట్లలో ఆర్టీసీ బస్సు సర్వీసులు కొనసాగుతుండగా ప్రతిరోజూ మూడు డిపోల ద్వారా రూ.30 లక్షలకు పైగానే ఆదాయం సమకూరుతున్నది. గతంలో ఎన్నడూలేని విధంగా ప్రతినెలా దాదాపుగా రూ.10కోట్ల వరకు ఆదాయం వస్తున్నట్లు జిల్లా ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలోని ఆయా డిపోల నుంచి హైదరాబాద్, గుల్బర్గా, మహబూబ్నగర్, కుంట, మెహిదీపట్నం, యాద్గిర్, మంత్రాలయం, సదాశివపేట, పరిగి-వికారాబాద్, సదాశివపేట రూట్లలో ఆర్టీసీకి మంచి లాభాలొస్తున్నాయి. బస్సు సర్వీసులతోపా టు కార్గో సర్వీసుల ద్వారా కూడా మరో రూ.1.80 కోట్ల ఆదాయం సమకూరుతుండటం గమనార్హం.
నెలకు రూ.10 కోట్ల ఆదాయం..
వికారాబాద్ జిల్లాలో ఆర్టీసీకి ప్రతినెలా దాదాపుగా రూ.10 కోట్ల వరకు ఆదాయం సమకూరుతున్నది. జిల్లాలోని 123 రూట్లలో బస్సులు (పరిగి డిపో పరిధిలో 46 రూట్లలో, తాండూరు డిపో పరిధిలో 37 దారుల్లో, వికారాబాద్ డిపో పరిధిలో 40 రూట్లలో) నడుస్తున్నాయి. అందులో 50 శాతం ఆర్టీసీ, 50 శా తం ప్రైవేట్ బస్సుల సేవలు కొనసాగుతున్నాయి. తాండూరు డిపో పరిధిలో నెలకు రూ.11 లక్షల ఆదాయం, వికారాబాద్ డిపో ద్వారా రూ.10 లక్ష లు, పరిగి డిపో ద్వారా రూ.10లక్షల నుంచి రూ. 12 లక్షల వరకు ఆదాయం వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే పరిగి డిపో పరిధిలోని 46 రూట్లలో బస్సులు నడుస్తుండగా 24 దారుల్లో కొంతమేర లాభాలు వస్తుండగా.. తాం డూరు డిపో పరిధిలోని 37 రూట్లలో బస్సులు నడుస్తుండగా 12 దారుల్లో లా భాలు ఆర్జిస్తుండగా, వికారాబాద్ డిపో పరిధిలోని 40 రూట్లలో బస్సులు నడుస్తుండగా 14 రూట్లలో లాభాలొస్తున్నాయి. అదేవిధంగా ఎక్స్ప్రెస్ సర్వీసులతోపాటు పలు పల్లె వెలుగు సర్వీసుల ద్వారా మాత్రమే లాభాలొస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
జిల్లాలో ప్రధానంగా ఎక్స్ప్రెస్ సర్వీసుల్లో పరిగి-గుల్బర్గా, హైదరాబాద్-గుర్మిట్కల్, హైదరాబాద్-కొడంగల్, హైదరాబాద్-కోస్గి, హైదరాబాద్-మంత్రాలయం, హైదరాబాద్-యాద్గిర్, కొడంగల్-హైదరాబాద్, కుంట(ఎక్స్ప్రెస్, పరిగి-హైదరాబాద్, పరిగి-మెహిదీపట్నం, తాండూరు నుంచి వెళ్తున్న హైదరాబాద్, కుంట డీలక్స్ బస్సు సర్వీసు లు, తాండూరు-హైదరాబాద్, తాండూరు-శ్రీశైలం, తాండూరు-యాదగిరిగుట్ట ఎక్స్ప్రెస్ సర్వీసులు, వికారాబాద్-హైదరాబాద్ దారుల్లోనే ఆర్టీసీకి మంచి లాభాలొస్తున్నాయి. అదేవిధంగా పల్లె వెలుగు సర్వీసుల్లో చౌదరిగూడ-షాద్నగర్, చౌడాపూర్-మహబూబ్నగర్, ఎన్కెపల్లి-షాద్నగర్, ఐనాపూర్-మహబూబ్నగర్, కొడంగల్-హైదరాబాద్, కుల్కచర్ల-మహబూబ్నగర్, మరికల్-మహబూబ్నగర్, పరిగి-హైదరాబాద్, పరిగి-షాద్నగర్, పరిగి-తాండూరు, తాండూరు-చించోలి, తాండూరు-జుంటుపల్లి, తాండూ రు -మహబూబ్నగర్, తాండూరు-యాద్గిర్, వికారాబాద్-తాండూరు, పరిగి-నస్కల్, తాండూరు-శంకర్పల్లి, సదాశివపేట-తాండూరు, వికారాబాద్-శంకర్పల్లి, పెద్దేముల్-తాండూరు, వికారాబాద్-హైదరాబాద్, చేవెళ్ల-హైదరాబాద్ రూట్లలో లాభాలొస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.