పరిగి : ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజల సమస్యలు పరిష్కరించాలని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి సూచించారు. మంగళవారం ఎంపీపీ కరణం అరవిందరావు అధ్యక్షతన పరిగి మండల పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు వెంటనే తీసుకోవాలని సూచించారు. గతంలో మండల సమావేశాలంటేనే తాగునీటి ఇబ్బందులు, కరెంటు కష్టాలపై హోరెత్తేదని, సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందజేస్తుందన్నారు.
24గంటలు నాణ్యమైన కరెంటు సరఫరాతో ఇబ్బంది లేకుండా పోయిందన్నారు. విద్యుత్కు సంబంధించి అదనపు ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాల ఏర్పాటు, ఏబీ స్విచ్ల ఏర్పాటు, ఇతర సమస్యలుంటే రాతపూర్వకం గా సర్పంచ్లు స్థానిక ఎంపీపీకి అందజేయాలని సూచించారు. రాబోయే 20రోజుల్లో సాధ్యమైనంత వరకు పరిష్కారం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం ముందుకు వచ్చిందని, అర్హులైన గిరిజనులకు హక్కుపత్రాలు అందజేస్తుందని తెలిపారు. విద్యుత్కు సంబంధించి ఏదైనా సమస్య ఏర్పడినపుడు ఫోన్ చేస్తే ఎందుకు ఫోన్ ఎత్తరని ట్రాన్స్కో ఏఈని మార్కెట్ చైర్మన్ సురేందర్ ప్రశ్నించారు.
విద్యా శాఖపై చర్చ సందర్భంగా తరగతి గదిలో ఉపాధ్యాయులు సెల్ఫోన్లలో మాట్లాడుతున్నారని రూప్ఖాన్పేట్ సర్పంచ్ నర్సింహ తెలిపారు. తమకు ఫిర్యాదు చేస్తే చర్యలు తప్పవని ఎంఈవో హరిశ్చందర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కరణం అరవిందరావు, వైస్ ఎంపీపీ సత్యనారాయణ, ఎంపీడీవో శేషగిరిశర్మ, జెడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు హఫీజ్, ఎంపీవో దయానంద్ పాల్గొన్నారు.