బొంరాస్పేట : రాష్ట్రంలోని రజకులను ఎస్సీ జాబితాలో చేరుస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షుడు సర్దార్ గోపి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం బొంరాస్పేట మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రజకుల చిరకాల వాంఛ అయిన ఎస్సీ జాబితాలో చేర్చే అంశాన్ని ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించాలని కోరారు. ప్రతి గ్రామంలో ఒక ఎకరా భూమిని రజకుల కోసం కేటాయించి దోబీఘాట్లు, కమ్యూనిటీ భవనాలను నిర్మించాలని, అన్యాక్రాంతమైన ఘాట్లను పునరుద్ధరించాలని కోరారు. సమావేశంలో రజక రిజర్వేషన్ సమితి జిల్లా ఉపాధ్యక్షుడు బాలప్ప, బీమయ్య, కొడంగల్ పట్టణ అధ్యక్షుడు ముత్యప్ప, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు చంద్రయ్య, కేఎన్పీఎస్ జిల్లా కార్యవర్గ సభ్యుడు లక్ష్మయ్య, వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు వెంకట్ నరేందర్, ఎల్హెచ్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సూర్యనాయక్, వెంకటయ్య పాల్గొన్నారు.
రజక రిజర్వేషన్ సమితి జిల్లా అధ్యక్షుడిగా మండలంలోని కొత్తూరు గ్రామానికి చెందిన చాకలి రవీందర్ను రాష్ట్ర అధ్యక్షుడు గోపి నియమించారు. దీనికి సంబంధించిన నియామక పత్రాన్ని రవీందర్కు అందజేశారు. అదే విధంగా జిల్లా సంయుక్త కార్యదర్శిగా అశోక్, బొంరాస్పేట మండల అధ్యక్షుడిగా శ్రీనివాస్, కొడంగల్ మండల కన్వీనర్గా మొగులప్పను నియమించారు.