వికారాబాద్ : పోలీస్ అధికారులు బాధ్యతగా ఉండి, ప్రజల్లో మంచి పేరు ప్రతిష్టలు పొందాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. మంగళవారం వికారాబాద్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడుతూ యూనిఫాం ధరించి విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులు అందరం మన కుటుంబ సభ్యులమని, అందరం కలిసి కట్టుగా క్రమశిక్షణతో విధులు నిర్వహించాలన్నారు. పోలీస్ స్టేషన్లకు వచ్చిన బాధితులకు న్యాయం అందించి పూర్తి బాధ్యత పోలీస్ స్టేషన్ అధికారులపైనే ఉంటుందని తెలిపారు.
పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఎన్ఫోర్మెంట్ వర్క్, కమ్యూనిటీ పోలీసింగ్ పైన ప్రత్యేకమైన దృష్టి సారించాలన్నారు. పోలీస్ అధికారులు నాయకత్వ లక్షణాలు ఏర్పర్చుకోవాలని, క్వాలిటీ వర్క్, టైమ్ మేనేజ్మెంట్ పైన ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా ప్రజలకు పోలీసింగ్ పట్ల అవగాహన కల్పించాలన్నారు.
బదిలీపై వచ్చిన పోలీస్ కానిస్టేబుళ్లకు పోస్టింగ్లు ఇచ్చిన ఎస్పీ..
ఇతర జిల్లాల నుంచి జిల్లాకు బదిలీపై వచ్చిన పోలీస్ కానిస్టేబుళ్లకు వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి పోస్టింగ్లు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇతర జిల్లాల నుంచి వచ్చిన పోలీస్ కానిస్టేబుళ్లకు సినియార్టీని బట్టి లిస్ట్ ప్రకారం.. పోస్టింగ్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. పోలీస్ స్టేషన్ పరిస్థితులపైన అవగాహన పెంచుకొని, క్రమంగా విధులు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ ఎం.ఏ. రశీద్, వికారాబాద్ డీఎస్పీ సత్యనారాయణ, పరిగి డీఎస్పీ శ్రీనివాస్, తాండూరు డీఎస్పీ లక్ష్మీనారాయణ, ఏఆర్ డీఎస్పీ సత్యనారాయణ, జిల్లాలోని సీఐలు, ఎస్సైలు, పోలీస్ స్టేషన్ అధికారులు పాల్గొన్నారు.