పరిగి : పేద ప్రజలకు ఉచిత న్యాయ సేవలు లభిస్తాయనే అంశంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సెక్రెటరీ రేణుక అన్నారు. మంగళవారం వికారాబాద్ కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలు నుంచి అధికారులు, ప్రజాప్రతినిధులతో ఉచిత న్యాయ సహాయంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ న్యాయం దృష్టిలో అందరూ సమానమేనని, అవగాహన లేని పేదలు ఈ అవకాశాన్ని పొందలేకపోతున్నారని తెలిపారు. రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరికి న్యాయం అందేలా గ్రామాల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయ్యాయని, న్యాయ సేవా చట్టం అమలులోకి వచ్చి 25 సంవత్స రాలు పూర్తయినందున ఆజాదీక అమృత్ మహోత్సవాల్లో భాగంగా అక్టోబర్ 2నుంచి నవంబర్ 14వ వరకు అన్ని గ్రామాల్లో ఉచిత న్యాయం చట్టాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నా మని తెలిపారు. జిల్లాలోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో పేద ప్రజలకు ఎలాంటి ఫీజులు లేకుండా ఉచిత న్యాయ సహాయం అందుతుందన్నారు. మహిళలు, పిల్లలు, కార్మికులు, దివ్యాంగులకు వార్షిక ఆదాయం 3 లక్షల కంటే తక్కువగా ఉన్న వారందరికీ ఉచిత న్యాయం అందుతుందని తెలిపారు. సమాజంలో 30శాతం మంది ఉచిత న్యాయ సేవను వినియోగించుకుంటున్నారని, 70 శాతం మంది వివిధ కారణాల వల్ల పొందలేక పోతున్నారన్నారు.
నవంబర్ 8నుంచి 14వ తేదీ వరకు న్యాయ సేవల వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో మూడు రోజుల అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయని చెప్పారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు జ్యూడిషియల్ ఆఫీసర్, ప్యానల్ లాయర్, పారా లీగల్ వాలంటీర్లు, న్యాయ విద్యార్థులు, ఎన్జీవోలు, సోషల్ ఆక్టివిస్టులతో ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి గ్రామాల్లో ఉచిత న్యాయం, న్యాయ చట్టాలపై అవగాహన నిర్వహించేందుకు వచ్చే వారికి సహకారం అందించాలని గ్రామపంచాయతీ అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచించారు. హత్య, అత్యాచారం, మైనర్ బాలికలపై అఘాయిత్యాలకు గురైన వారికి రూ. 7లక్షలు, రోడ్డు ప్రమాదంలో అంగవైకల్యం చెందిన వారికి రూ. 4లక్షలు, తాత్కాలిక గాయాలకు రూ. 2లక్షలు చొప్పున బాధితులకు నష్టపరిహారం అందించడం జరుగుతుందన్నారు.
వ్యాక్సినేషన్ను విజయవంతం చేసిన స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిఖిల, అదనపు జిల్లా జడ్జి పద్మ, జిల్లా ఎస్పీ నారాయణ, అదనపు కలెక్టర్ చంద్రయ్య, ఏఎస్పీ రషీద్, జడ్పీ సీఈవో జానకిరెడ్డి, డీఆర్డీవో కృష్ణన్, జిల్లా వైద్యాధికారి తుకారాం, ఎక్సైజ్ సూపరింటెండెంట్ వరప్రసాద్, డీడబ్ల్యూవో లలితకుమారి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, సభ్యులు పాల్గొన్నారు.