పెద్దేముల్ : రైతులు యాసంగి సీజన్లో వరికి బదులుగా ఆరుతడి పంటలను మాత్రమే సాగు చేయాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల సూచించారు. బుధవారం మండల పరిధిలోని మంబాపూర్ గ్రామంలో కొనసాగుతున్న వరి కొనుగోలు కేంద్రం వద్ద రైతులతో మాట్లాడుతూ యాసంగి సీజన్లో రైతులు ఆరుతడి పంటలను వేసుకోవాలని వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలతో కలిసి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నిఖిల మాట్లాడుతూ యాసంగిలో కేంద్ర ప్రభుత్వం ఎఫ్సీఐ (భారత ఆహార సంస్థ) ద్వారా ధాన్యాన్ని కొనమని, అదే విధంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయమని స్పష్టంగా చెప్పడంతో రైతులు ఎవ్వరు కూడా యాసంగిలో వరి పంటను సాగు చేసి నష్టపోవద్దని అన్నారు. అందువల్ల వరికి బదులుగా మండలంలోని రైతులు వేరుశనగ, శనగ, ఆవాలు, నువ్వులు, కుసుమ, ఆముదం, పెసర, మినుము, పొద్దు తిరుగుడు, జొన్నసాగు చేసి లాభాలు పొందాలన్నారు.
పలువురు రైతులు కోట్పల్లి చెరువు కింద పొలాలు ఉండటంతో చెరువు నీటితో వరి పంటలు గతంలో సాగు చేసే వాళ్లమని, ప్రతి ఒక్కరి దగ్గర దాదాపు బోరుబావులు ఉండడంతో వరి పంటలను మాత్రమే గత కొన్ని సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్నామని కలెక్టర్కు సూచించారు. అందుకు స్పందించిన కలెక్టర్ కోట్పల్లి ప్రాజెక్టు నీరు అసలు రావడం లేదని అందరూ బోరుబావులు ఉండడంతోనే ప్రతిసారి యాసంగిలో వరి పంటను పెద్ద మొత్తంలో సాగు చేస్తున్నారని రైతులకు సూచించారు. వానాకాలం పంటల విషయం పక్కన పెడితే కేవలం ఈ ఆరు నెలల్లో పండించే పంటలపై రైతులు దృష్టి పెట్టాలన్నారు. అంతకుముందు వ్యవసాయ అధికారులతో యాసంగిలో ఏ పంటలు వేసుకుంటే ఎంత మొత్తంలో దిగుబడి వచ్చి లాభాలు పొందవచ్చు అనే విషయాలపై అవగాహన కల్పించారు.
ముఖ్యంగా రైతులు ప్రభుత్వ సూచనలు పాటించి ప్రభుత్వం నిర్దేశించిన పంటలను మాత్రమే యాసంగిలో సాగు చేయాలని, ఆ దిశగా వ్యవసాయ అధికారులు గ్రామ గ్రామాన రైతులకు క్షేత్రస్థాయిలో గ్రామాల పర్యటన చేసి అవగాహన కల్పించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి గోపాల్ను కలెక్టర్ ఆదేశించారు. అనంతరం గ్రామ సర్పంచ్ శ్రావణ్కుమార్తో మాట్లాడుతూ మీరు ఏ పంటలు వేశారు? ఈ యాసంగిలో ఏం పంటలు వేయబోతున్నారు? అని అడుగగా యాసంగిలో మొక్కజొన్న పంటను వేయాలని నిర్ణయించుకొన్నానని సర్పంచ్ శ్రావణ్ కలెక్టర్కు బదులిచ్చారు. కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్, తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానం ఏరువాక ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ప్రవీణ్, తాండూరు ఏడీఏ శంకర్ రాథోడ్, ఏఈఓ బాలకోటేశ్వర్లు, గ్రామ సర్పంచ్ శ్రావణ్ కుమార్, ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.