బొంరాస్పేట : గ్రామాల్లో ఏర్పాటు చేసిన నర్సరీ పనులను వేగవంతం చేయాలని, ఈ నెలాఖరులోగా సంచుల్లో మట్టినింపి విత్తనాలు వేసే పనులు పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ చంద్రయ్య అధికారులను ఆదేశించారు. శుక్రవారం మండలంలోని బురితండాలో నర్సరీ పనులను, జాతీయ రహదారి పక్కన ఎన్ఎంఎల్ఏ ప్లాంటేషన్ను ఆయన పరిశీలించారు. నర్సరీ పనులు ఎక్కడైనా నెమ్మదిగా జరుగుతుంటే వేగం పెంచాలని, మట్టి, విత్తనాల సేకరణ పూర్తి చేసి బ్యాగుల్లో మట్టి నింపాలని ఆదేశించారు.
సకాలంలో విత్తనాలు నాటితేనే హరితహారానికి మొక్కలు అందుబాటులో ఉంటాయన్నారు. జాతీయ రహదారి పక్కన ప్లాంటేషన్ను పరిశీలించారు. మొక్కలు ఎండిపోకుండా నీళ్లు పోయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో మోహన్రాజ్, ఏపీవో మల్లికార్జున్ పాల్గొన్నారు.