షాబాద్, ఆగస్టు 5 : గ్రామాలను స్వచ్ఛత దిశగా మార్చేందుకు సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పల్లెప్రగతి కార్యక్రమం ద్వారా పల్లెల రూపురేఖలు మారిపోతున్నాయి. ప్రభుత్వం గ్రామాల్లో వివిధ రకాల అభివృద్ధి పనులు చేపడుతున్నది. షాబాద్ మండలంలోని కేసారం గ్రామంలో పల్లెప్రగతిలో చేపట్టిన పనులు మొత్తం పూర్తి అయ్యాయి. వైకుంఠధామం, కంపోస్ట్యార్డు అందుబాటులోకి వచ్చాయి. హరితహారం నర్సరీ ఏర్పాటు చేసిన మొక్కలు పెంచడంతో పాటు పల్లెప్రకృతివనంలో వివిధ రకాల మొక్కలు నాటి సంరక్షిస్తున్నారు. ఈ గ్రామంలో రూ. 30లక్షలతో సీసీ రోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీలు, ఫార్మేషన్ రోడ్ల నిర్మాణం చేపట్టారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతిరోజు ఇంటింటికీ స్వచ్ఛమైన నల్లానీరు సరఫరా చేస్తున్నారు.
కేసారంలో పూర్తయిన ప్రగతి పనులు
గ్రామంలో 1120 మంది జనాభా ఉన్నారు. ప్రతి నెల ప్రభుత్వం నుంచి రూ. 96వేలు అందిస్తున్నారు. రూ. 12.60లక్షలతో వైకుంఠధామం, రూ. 3లక్షలతో కంపోస్ట్యార్డు, రూ.2లక్షలతో పల్లెప్రకృతివనం పనులు చేపట్టారు. ఈ పనులన్నీ పూర్తి కావడంతో అందుబాటులోకి వచ్చాయి. నర్సరీలో వివిధ రకాల 12వేల మొక్కలు పెంచుతున్నారు. ఎకరం పొలంలో ఏర్పాటు చేసిన పల్లెప్రకృతివనంలో 20రకాలకు సంబంధించిన 4వేల మొక్కలు పెంచుతున్నారు. గ్రామంలోని ప్రధాన రోడ్లకు ఇరువైపులా వెయ్యి మొక్కలు నాటి నీరుపోసి సంరక్షిస్తున్నారు. ప్రజల ఇండ్ల వద్ద నుంచి ప్రతిరోజు తడి, పొడి చెత్తను సేకరించి పంచాయతీ ట్రాక్టర్ ద్వారా కంపోస్ట్యార్డుకు తరలిస్తున్నారు. ట్యాంకర్ ద్వారా మొక్కలకు పంచాయతీ సిబ్బంది నీరు పోస్తున్నారు. రోడ్లపై చెత్తాచెదారం లేకుండా సిబ్బందితో శుభ్రం చేయిస్తున్నారు.
రూ. 30లక్షలతో అభివృద్ధి..
రెండేళ్ల కాలంలో రూ. 30లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టారు. రూ. 5లక్షల ఎంపీ నిధులు, రూ. 5లక్షల మైన్స్, రూ. 2లక్షల జడ్పీ, రూ. 3లక్షల జీపీ నిధులతో గ్రామంలోని ఆయా కాలనీల్లో సీసీ రోడ్లు నిర్మాణం చేపట్టారు. రూ. 2.50లక్షలతో గిరిజన తండాకు ఫార్మేషన్ రోడ్డు, రూ. 2లక్షలతో రోడ్డు వెడల్పు పనులు, రూ. 2లక్షలతో అండర్గ్రౌండ్ డ్రైనేజీ, స్కూల్ నుంచి చెరువు వరకు రూ. 2లక్షలతో ఫార్మేషన్ రోడ్డు నిర్మించారు. ఎర్రకుంట నుంచి డంపింగ్యార్డు వరకు రూ. 2లక్షలు, వైకుంఠధామం వద్ద రూ. 2లక్షలతో ఫార్మేషన్ రోడ్డు నిర్మాణం పనులు చేపట్టారు.
పల్లెప్రగతి పనులు పూర్తి చేశాం
గ్రామంలో పల్లెప్రగతి ద్వారా చేపట్టిన వైకుంఠధామం, కంపోస్ట్యార్డు తదితర పనులు పూర్తి చేశాం. ప్రజలకు అందించిన చెత్త బుట్టల ద్వారా ప్రతిరోజు తడి, పొడి చెత్తను సేకరించి ట్రాక్టర్ ద్వారా కంపోస్ట్యార్డుకు తరలిస్తున్నాం. నర్సరీలో 12వేల మొక్కలు, పల్లెప్రకృతివనంలో 20రకాలకు సంబంధించిన 4వేల మొక్కలు పెంచుతున్నాం. దోమల నివారణకు మందులు పిచికారీ చేయిస్తున్నాం. సంపూర్ణ పారిశుధ్యంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం.
గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం
పల్లెప్రగతి ద్వారా గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నాం. ప్రభుత్వ నిధులతో ఇప్పటికే గ్రామంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టాం. సీసీ రోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీల ఏర్పాటుతో గ్రామం పరిశుభ్రంగా మారింది. రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటి సంరక్షిస్తున్నాం. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రామం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నది.