మోమిన్పేట : గ్రామంలో మిషన్ భగీరథ పైపుల లీకేజీలతో నీరు కలుషితం కాకుండా ఇంటింటికీ తాగునీటి సరఫరా చేయాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. శనివారం మండల పరిధిలోని మొరంగపల్లి గ్రామంలో మీతో నేను కార్యక్రమంలో భాగంగా పర్యటించి గ్రామంలో నెలకొన్న సమస్యలు గ్రామస్తులతో చర్చించి తెలుసుకున్నారు. గ్రామస్తులు కరెంట్, మిషన్ భగీరథ నీటి సమస్యలు, మురుగు కాలువలు, రెవెన్యూ సమస్యలు ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వికారాబాద్ నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధి కోసం నిరంతరం మీతో నేను కార్యక్రమంతో ప్రజల్లోకి వస్తున్నానన్నారు.
గ్రామంలో మిషన్ భగీరథ పైపుల లీకేజీలను వెంటనే సరి చేయాలని గ్రామంలో నీటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. రైతులు కోరినా విధంగా పంట పొలల్లో ట్రాన్ఫార్మర్ మంజూరు, ఇనుప స్తంభాలు వెంటనే తొలగింపు, వీధి దీపాలకు ఆన్ఆఫ్ స్విచ్ల ఏర్పాటు, కరెంట్ సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని విద్యుత్ అధికారులకు సూచించారు. రెవెన్యూ సమస్యలపై ధరణి పోర్టల్లో అందుబాటులో ఉన్న ఆప్షన్లపై ప్రజలకు అవగాహన కల్పించాలని రెవెన్యూ అధికారులకు సూచించారు.
అనంతరం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడి పాఠశాలలో విద్యా బోధన, మధ్యాహ్నా భోజనం, క్రమశిక్షణ అంశాలను తెలుకుని విద్యార్థులకు ఆంగ్ల వ్యాకరణం బోధించి విద్యార్థులతో ముచ్చటించారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ విజయ్కుమార్, మండల అధ్యక్షుడు వెంకట్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సర్పంచ్ సంఘం అధ్యక్షుడు నర్సింహ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచులు, మండల అధికారులు, నాయకులు పాల్గొన్నారు.