మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి
వికారాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో అలుపెరగని పోరాటం చేసిన ఉద్యమకారులను ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తించడంతో అరుదైన గౌరవం దక్కిందని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి తెలిపారు. గురువారం వికారాబాద్లోని అతిథి గృహం నుంచి బసంత్ ఫంక్షన్హాలు వరకు భారీగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం పౌర సన్మాన కార్యక్రమంలో భాగంగా కాళోజీ జయంతిని పురస్కరించుకొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మహేందర్రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అలుపెరగని పోరాటం చేసిన ఉద్యమకారులను టీఆర్ఎస్ ప్రభుత్వం గుర్తిస్తున్నదని తెలిపారు.
శుభప్రద్పటేల్ ఉద్యమంలో చరుకుగా పాల్గొనడంతో ఆయనకు మద్దతుగా విద్యార్థులు, ఆయా సంఘాల నాయకులు తోడుగా నిలిచారని వివరించారు. మరికొంత మంది ఉద్యమకారులు నిరుత్సాహపడకుండా పార్టీ కోసం పని చేస్తే భవిష్యత్లో మంచి ఫలితాలు అందుతాయన్నారు. అన్ని వర్గాల ప్రజలకు సరైన పాలన సీఎం కేసీఆర్ అందిస్తున్నారని ఎమ్మెల్సీ పేర్కొన్నారు.
ఎమ్మెల్యే ఆనంద్ మాట్లాడుతూ.. వికారాబాద్ గడ్డ ఉద్యమాలకు అడ్డా అని, పార్టీ కోసం పని చేసిన ప్రతి ఒక్కరి గురించి సీఎం కేసీఆర్కు పూర్తిగా తెలుసన్నారు. మున్ముందు ఉద్యమకారులకు ప్రభుత్వం మంచి గుర్తింపునిస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ పార్టీ పటిష్టతకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఏ పార్టీ చేయలేనన్ని సభ్యత్వాలు(60లక్షలు) టీఆర్ఎస్ పార్టీ చేయడంపై ఆయనత సంతోషం వ్యక్తం చేశారు.
రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్పటేల్ మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో ఉద్యమాలు, దీక్షలు చేశామన్నారు. అప్పటి ప్రభుత్వాలకు, ప్రజా ప్రతినిధులకు వ్యతిరేకంగా పోరాటాల్లో పాల్గొన్నామన్నారు. పోలీసులు తమపై పలు రకాల కేసులు పెట్టి జైళ్లపాలు చేశారని తెలిపారు. పోలీసులకు, కేసులకు భయపడకుండా రాష్ట్రసాధనే ముఖ్యంగా ముందుకు సాగుతూ, కేసీఆర్ సూచనలు పాటిస్తూ ఉద్యమాల్లో పాల్గొన్నామని చెప్పారు. తనతోపాటు మరికొంత మంది ఉద్యమంలో పాల్గొని మద్దతిచ్చారని తెలిపారు. మన నీళ్లు, నిధులు, నియామకాలు అంది ఈ ప్రాంత ప్రజలు సంతోషంగా ఉంటారని ఉద్యమాలు చేసినట్లు చెప్పారు.
కార్యక్రమంలో టీఎస్ఈడబ్ల్యూఐడీసీ చైర్మన్ నాగేందర్గౌడ్, జడ్పీ వైస్ చైర్మన్ విజయ్కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీకృష్ణగౌడ్, పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి, మర్పల్లి జడ్పీటీసీ మధుకర్, టీఆర్ఎస్ కేవీ జిల్లా అధ్యక్షుడు బి.కృష్ణయ్య, వీడీడీఎఫ్ ప్రతినిధులు కె.శ్రీనివాస్, దేవదాస్, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు వడ్ల నందు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, సర్పంచ్లున్నారు.