బొంరాస్పేట : కుష్ఠువ్యాధిని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి చికిత్స అందిస్తే అంగవైకల్యం రాకుండా అడ్డుకోవచ్చని కుష్టు వ్యాధి రాష్ట్ర సంయుక్త సంచాలకుడు డాక్టర్ జాన్బాబు అన్నారు. శనివారం బొంరాస్పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలకు కుష్టు వ్యాధి లక్షణాలు, వ్యాధి గుర్తింపు, చికిత్సపై అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో జాన్బాబు మాట్లాడుతూ.. కుష్టు వ్యాధి సోకిన వ్యక్తికి ప్రాథమిక స్థాయిలో చర్మంపై రాగి రంగు మచ్చలు కనిపిస్తాయని, ఆ స్థానంలో స్పర్శ ఉండదని చెప్పారు.
ఆశ కార్యకర్తలు గ్రామాల్లో ఇంటింటి సర్వేకు వెళ్లినప్పుడు ఇలాంటి లక్షణాలు ఉన్నవారిని గుర్తించి దవాఖానకు పంపిస్తే వారికి వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స అందిస్తామన్నారు. వ్యాధి నిర్ధారణ అయిన వారికి సెల్ప్కేర్ కిట్ను ఉచితంగా అందిస్తామని చెప్పారు. వ్యాధి ముదిరితే ఆపరేషన్ చేసే అవకాశం కూడా ఉంటుందని అన్నారు. వైద్య సిబ్బంది కుష్టు వ్యాధిపై గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించి సకాలంలో చికిత్స తీసుకునేలా ప్రోత్సహించాలని డాక్టర్ జాన్బాబు అన్నారు.
కొడంగల్, బొంరాస్పేట ప్రాంతాల్లో కుష్టువ్యాధి కేసులు ఎక్కువగా ఉన్నాయని, వచ్చే ఏడాది జనవరిలో కేంద్రం పరిశీలనా బృందాలు ఈ రెండు మండలాలను సందర్శించే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్వో రవీంద్ర యాదవ్, డెర్మటాలజిస్ట్ సంతోషి, మహబూబ్నగర్ డీపీఎంవో వెంకటాచారి, హెల్త్ ఎడ్యుకేటర్ భాస్కరాచారి, సూపర్వైజర్ మణిమాల, సిబ్బంది పాల్గొన్నారు.