పరిగి : జిల్లాలో అసంపూర్తిగా ఉన్న జాతీయ రహదారుల అభివృద్ధి పనులు వెంటనే పూర్తి చేయాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని తన చాంబర్లో జాతీయ రహదారుల అసంపూర్తి నిర్మాణపు పనుల పురోగతిపై ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మన్నెగూడ నుంచి రావులపల్లి వరకు గల జాతీయ రహదారి-163 రోడ్డు పనులలో ఉన్న చిన్నచిన్న సమస్యలు వెంటనే పరిష్కరించి పూర్తి చేయాల్సిందిగా పేర్కొన్నారు. రెవెన్యూ అధికారుల సహకారంతో రోడ్డు మార్గంలో ఉన్న ఆక్రమణలను తొలగించి పనులు పూర్తి చేయాలన్నారు. ధార్మిక కట్టడాల విషయమై వివిధ కుల సంఘాల పెద్దలతో చర్చించి సమస్యలను అధిగమించాలని చెప్పారు.
పరిగి మండలంలోని నజీరాబాద్, బొంరాస్పేట్, తుంకిమెట్ల వద్ద పనులు పూర్తి చేయాల్సిందిగా కలెక్టర్ ఆదేశించారు. తాండూరు డివిజన్లోని మహబూబ్నగర్-చించోలి వరకు జాతీయ రహదారి-167 రోడ్డు పనులను వెంటనే ప్రారంభిచాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్, నేషనల్ హైవేస్ హైదరాబాద్ డివిజన్ ఈఈ ధర్మారెడ్డి, వికారాబాద్ ఆర్అండ్బీ ఈఈ లాల్సింగ్, వికారాబాద్, తాండూరు ఆర్డీవోలు ఉపేందర్రెడ్డి, అశోక్కుమార్ పాల్గొన్నారు.