వికారాబాద్ : గంజాయి, డ్రగ్స్, మత్తు పదార్థాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. సోమవారం వికారాబాద్ పురపాలక కార్యాలయంలోని మున్సిపల్ చైర్పర్సన్ అధ్యక్షతన ప్రజా ప్రతినిధులు, వ్యవసాయాధికారులకు గంజాయి, డ్రగ్స్, మత్తుపదార్థాల నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని ప్రజలు, ప్రజాప్రతినిధులు అందరూ గంజాయి వంటి మాదకద్రవ్యాలను అంతమొందించేందుకు సామాజిక బాధ్యతగా తీసుకోవాలన్నారు.
ప్రజాప్రతినిధులు ప్రజల్లో అవగాహన కల్పించాలని, ఇటువంటి చట్ట వ్యతిరేక చర్యలపై ప్రజలు, ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండి పోలీసులకు ముందస్తు సమాచారం అందించాలని తెలిపారు. ఎవరైనా సాగు చేస్తే ప్రభుత్వం అందించే సబ్సిడీలు రద్దు అవుతాయనే విషయాలపై అవగాహన కల్పించాలన్నారు. దేశ భవిష్యత్ను నిర్ణయించే యువత గంజాయి, మత్తు పదార్థాల బారిన పడకుండా వారి భవిష్యత్కు బాటలు వేయాలని సూచించారు.
గంజాయి, మత్తు పదార్థాల రహిత జిల్లాగా మార్చడమే మన లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మంజుల, కమిషన్ శరత్చంద్ర, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి, వికారాబాద్ డీఎస్పీ సత్యనారాయణ, ఏపీఎస్ చైర్మన్ ముత్యంరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ శంషాద్ బేగం, సీఐ రాజశేఖర్, ఎస్సైలు, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, వ్యవసాయా అధికారులు పాల్గొన్నారు.