కొడంగల్ : వ్యాక్సినేషన్ వేసుకోవడం వల్ల కరోనా, ఒమిక్రాన్ అదుపుచేసుకోవచ్చని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య అన్నారు. శుక్రవారం మండలంలోని అంగడిరైచూర్, కస్తూర్పల్లి గ్రామాల్లో పర్యటించి వ్యాక్సినేషన్పై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు మొదటి డోసు వ్యాక్సిన్ వేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాక్సినేషన్ వేసుకోవడంపై ఎటువంటి అపోహ, ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇది వరకే జిల్లాలో దాదాపు 60శాతం వరకు వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేసినట్లు తెలిపారు.
మొదట్లో కొంత వరకు అపోహలు ఉండటం వల్ల వ్యాక్సిన్ వేసుకోవడంలో వెనుకంజ వేయడం జరిగిందని, ప్రస్తుతం ప్రభుత్వం వైద్య, ఆశ, అంగన్వాడీ, రెవెన్యూ తదితర శాఖల ద్వారా ప్రజలకు వ్యాక్సినేషన్పై అవగాహన కల్పించడం జరిగిందన్నారు. రెండు సంవత్సరాల కాలంగా కరోనా ప్రభావంతో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని, ప్రస్తుతం ఒమిక్రాన్ ప్రమాదం పొంచి ఉండటం వల్ల ప్రజలు ముందస్తు జాగ్రత్తగా తప్పకుండా వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు. అంగడిరైచూర్ గ్రామంలో ఇప్పటి వరకు 273మంది మొదటి డోసు వ్యాక్సిన్ వేసుకునే వారు, రెండో డోసు వేసుకునే వారు మిగిలి ఉన్నారంటే అవగాహన లోపమన్నారు.
ఇంటింటికీ తిరిగి వ్యాక్సిన్ అందించాలని, ఎప్పటికప్పుడు వ్యాక్సిన్ అందించిన వివరాలను తప్పకుండా దగ్గర ఉంచుకోవాలని తెలిపారు. అదనపు కలెక్టర్ స్వయంగా ఇంటింటిని సందర్శించి వారితో మాట్లాడి వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల ప్రయోజనాలు, కలిగే నష్టాలను వారికి వివరించి వ్యాక్సిన్ వేయించారు. మండలంలో కొంత వరకు వ్యాక్సినేషన్ ప్రక్రియ బాగానే కొనసాగుతుందని, మరింత స్థాయిలో అవగాహన కల్పించి మిగిలిన వారందరికీ వ్యాక్సిన్ వేసుకునే విధంగా అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ గోవిందు, ఎంపీడీవో మోహన్లాల్, ఏఎన్ఎం విజయలక్ష్మి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.