న్యూఢిల్లీ, జూలై 24 : కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ..స్పోర్ట్స్ యుటిలిటీ విభాగంలో పోటీని మరింత పెంచాలనే ఉద్దేశంతో మరో మాడల్ను తీసుకొచ్చింది. ఇప్పటికే ఉన్న బ్రెజ్జా మాడల్ను మరింత ఆధునీకరించి విడుదల చేసింది. ఈ కారు ప్రారంభ ధర రూ.7.5 లక్షలుగా నిర్ణయించింది. ఈ కారు లీటర్ పెట్రోల్కు 20 నుంచి 21 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇవ్వనుండగా, సీఎన్జీ మాడల్ 27 కిలోమీటర్లు ప్రయాణించనున్నది. భద్రత విషయంలో 5స్టార్ రేటింగ్ పొందిన ఈ మాడల్లో 360 డిగ్రీల కెమెరా సిస్టమ్, ఫ్రంట్-రియర్ పార్కింగ్ సెన్సార్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.
ఈ సందర్భంగా కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ అధికారి పార్థో బెనర్జీ మాట్లాడుతూ..ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎస్యూవీ వాహన విక్రయాలు 25-30 శాతం లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. ఈ విభాగంలోకి మరిన్ని మాడళ్లను విడుదల చేయడం ఇందుకు కలిసిరానున్నట్టు తెలిపారు. గతేడాది సంస్థ 5.5 లక్షల ఎస్యూవీ వాహనాలను విక్రయించగా, ఈ సారి 7 లక్షల యూనిట్లు లక్ష్యంగా పెట్టుకుందన్నారు. మొత్తం వాహన విక్రయాల్లో ఎస్యూవీ వాటా 2022-23లో 12 శాతంగా ఉండగా, ప్రస్తుతం ఇది 30 శాతానికి ఎగబాకిందని చెప్పారు. ఈ విభాగంలో సంస్థ బ్రెజ్జా, ఎర్టిగా, ఈ-విటారా, ఫ్రాంక్స్, గ్రాండ్ విటారా, ఇన్విక్టో, జిమ్నీ, విక్టోరిస్, ఎక్స్ఎల్6 మాడళ్లను విక్రయిస్తున్నది.