పరిగి, ఏప్రిల్ 24 : ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే ప్రథమ లక్ష్యంగా ఏర్పడిన ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ ఆది నుంచి జిల్లాలో మంచి పట్టును కలిగి ఉన్నది. మలిదశ ఉద్యమం ప్రారంభమైన కొద్ది నెలల్లోనే జిల్లా పరిధిలో ఉద్యమం ప్రారంభమైంది. ‘నిధులు, నీళ్లు, నియామకాలు’ ట్యాగ్లైన్తో ఈ రంగాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయం ప్రజలకు వివరిస్తూ భవిష్యత్ తరాలకు నష్టం వాటిల్లరాదనే ఉద్దేశంతో ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా 2001లో పార్టీని ఏర్పాటు చేసిన ఉద్యమ నాయకుడు కేసీఆర్ వెంట జిల్లా ప్రజలు నడిచారు. జిల్లా పరిధిలో ఉద్యమ నేత కేసీఆర్ చేసిన పర్యటనల్లో ఆయన ప్రసంగాలకు ప్రభావితమై అనేక మంది ఉద్యమంలో చేరారు. ప్రత్యేకంగా రాష్ట్రం ఏర్పాటు ఒక్కటే పరిష్కారమనే నిర్ణయానికి వచ్చిన ప్రజలు స్వచ్ఛందంగా ఉద్యమంలో భాగస్వాములయ్యారు. జిల్లా పర్యటన సందర్భంగా వికారాబాద్ ప్రత్యేక జిల్లా డిమాండ్కు కేసీఆర్ మద్దతు ఇవ్వడంతో తెలంగాణ ఉద్యమం మరింత ఉవ్వెత్తున ఎదగడానికి దోహదం చేసిందని చెప్పవచ్చు. ఉద్యమ నేత కేసీఆర్ అవలంబించిన ప్రత్యేక వ్యూహంతో అప్పటి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని పశ్చిమ ప్రాంతంగా ఉన్నటువంటి ప్రస్తుత వికారాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి బలంగా నిలిచింది.
2012లో అనంతగిరి వేదికగా ప్లీనరీ
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉద్యమానికి ఊపిరిలూదిన ఈ ప్రాంతం పార్టీ ఆవిర్భావ దినోత్సవ ప్లీనరీకి వేదికగా నిలిచింది. 2012లో అనంతగిరిలోని మైదానం వేదికగా పార్టీ ప్లీనరీ నిర్వహించారు. ఈ ప్లీనరీలోనే అనేక కీలకమైన తీర్మానాలను పార్టీ ఆమోదించింది. వికారాబాద్లో భారీ బహిరంగసభ నిర్వహణ, జిల్లాలోని పరిగి, ఇతర ప్రాంతాల్లో సైతం కేసీఆర్ పర్యటించడం పార్టీ పటిష్టానికి దోహదం చేసింది. అలాగే అధినేత పర్యటనలతో వికారాబాద్ ప్రాంతంలో ఉద్యమం మరింత బలపడింది. 2002లో పల్లెబాట కార్యక్రమంలో భాగంగా మొదట ధారూర్ మండలం మున్నూరు సోమారం గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ఉద్యమ నాయకుడు కేసీఆర్ పాల్గొన్నారు. 2003లో వికారాబాద్లోని మిషన్ గ్రౌండ్లో జరిగిన సభలో సైతం కేసీఆర్ పాల్గొని ఉద్యమ భావజాల వ్యాప్తికి కృషి చేశారు. దీంతో తెలంగాణ ఉద్యమ తీవ్రతతో అన్ని ఉద్యోగ సంఘాల్లో తెలంగాణ పేరిట సంఘాలు ఏర్పాటయ్యాయి. పంచాయతీరాజ్ యూనియన్ ఏపీ పేరిటే కొనసాగింది. ఉద్యమ ప్రభావ నేపథ్యంతో జిల్లా నుంచే ప్రత్యేకంగా తెలంగాణ పేరిట పంచాయతీరాజ్ యూనియన్ ప్రారంభం కావడం గమనార్హం. 2008లో జరిగిన వికారాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మోమిన్పేట్లో జరిగిన ప్రచార సభలో పార్టీ అధినేత కేసీఆర్ పాల్గొన్నారు. కేసీఆర్ పర్యటనలతో ఓ వైపు ఉద్యమం బలపడగా పార్టీ పటిష్టానికి సైతం మరింత దోహదం చేసింది.