కులకచర్ల, జూలై 26 : స్వచ్ఛత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం గ్రామపంచాయతీలకు భారీగా నిధులను కేటాయిస్తున్నది. ప్రతి గ్రామపంచాయతీకి ట్రాక్టర్ను అందించడంతోపాటు పారిశుధ్యం పనులు సక్రమంగా నిర్వహించడానికి సిబ్బందిని నియమించింది. ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించి గ్రామపంచాయతీలకు సూచిస్తున్నది.
కులకచర్లలో సుమారు 10వేలకు పైగా జనాభా ఉన్నది. 1170 కుటుంబాలున్నాయి. 9 మంది పారిశుధ్య కార్మికులు పనిచేస్తున్నారు. 900 కుటుంబాలకు చెత్త బుట్టలు అందజేశారు. సర్పంచ్ సౌమ్య, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్రెడ్డి వార్డు సభ్యుల సహకారంతో గ్రామాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి మౌలిక సదుపాయాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. గ్రామాన్ని చెత్త రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు గ్రామపంచాయతీ తనవంతు కృషిచేస్తున్నది. కాలనీల్లో అన్ని విధాలుగా ప్రజలకు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు వసతులను కల్పిస్తున్నారు.
పారిశుధ్య పనులు
ప్రతి కాలనీలో మురుగునీటి వ్యవస్థ ఏర్పాటు చేయడంలో భాగంగా మురుగునీటి కాల్వలను శుభ్రం చేయడంతోపాటు మురుగునీరు నిల్వ ఉండకుండా గ్రామపంచాయతీ ప్రత్యేక చొరవ చూపిస్తున్నది. అవసరమున్న చోట్ల కొత్త కాల్వల ఏర్పాటు, అండర్ డ్రైనేజీ పనులు కూడా నిర్వహిస్తున్నారు.
ప్రతి రోజు చెత్త తరలింపు
ప్రతి రోజు గ్రామపంచాయతీ ద్వారా ట్రాక్టర్లో 5 క్వింటాళ్ల చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. దీనికిగాను తడి, పొడి చెత్తపై అవగాహన కల్పించారు. ప్రతి ఇంటికి రెండు చెత్త బుట్టలను అందించి చెత్తను నేరుగా ట్రాక్టర్లో వేసేలా చూస్తున్నారు. చాలావరకు చెత్త కనబడకుండా చర్యలు తీసుకుంటున్నారు.
వర్మీకంపోస్ట్ ఎరువు తయారీ
తడి, పొడి చెత్తను వేరు చేయడంతోపాటు డంపింగ్ యార్డు వద్ద వర్మీకంపోస్ట్ ఎరువును కూడా తయారు చేస్తున్నారు. దీనిని మొక్కలకు ఉపయోగించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. తరలించిన చెత్తతో ప్రతి నెల 125 కిలోల ఎరువును తయారు చేస్తున్నారు. కిలో ఎరువు మార్కెట్లో సుమారు రూ.100వరకు పలుకుతున్నది. అంటే నెలకు రూ.12,500 వరకు ఆదాయం వస్తున్నది. పొడి చెత్త ద్వారా కూడా ఆదాయం సమకూరుతున్నది. గ్రామపంచాయతీలో తయారు చేసిన సేంద్రియ ఎరువు తమకు కావాలని రైతులు సైతం గ్రామపంచాయతీ ద్వారా కొనుగోలుకు సిద్ధపడుతున్నారు.
చెత్త రహిత గ్రామంగా..
కాలనీల్లో ఎవ్వరూ చెత్త వేయకుండా ప్రతి రోజు గ్రామంలో తిరుగుతూ ప్రజలకు తడి, పొడి చెత్త నిర్వహణ, చెత్త రోడ్డుపై, కాలనీల ఇళ్ల మధ్య వేస్తే వచ్చే అనర్థాల గురించి పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్రెడ్డి, సర్పంచ్ సౌమ్యారెడ్డి అవగాహన కల్పిస్తున్నారు. నిబంధనలు పాటించకపోతే జరిమానా విధించడంతో ప్రజలు ఎక్కడా చెత్త వేయకుండా జాగ్రత్తలు తీసుకుంటుండడంతో కులకచర్ల చెత్తరహిత గ్రామంగా మారింది. జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ పైలట్ గ్రామంగా కూడా కులకచర్ల ఎంపికైంది.
స్వచ్ఛ గ్రామంగా మారుస్తున్నాం : సౌమ్య, సర్పంచ్
కులకచర్లను స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్నాం. వార్డుల వారీగా ప్రజలకు తడి, పొడి చెత్త నిర్వహణపై అవగాహన కల్పించాం. తప్పనిసరిగా తడి, పొడి చెత్త వేరు వేసేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి రోజు మూడు ట్రాక్టర్ల చెత్తను గ్రామం నుంచి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నాం. మురుగునీరు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయిస్తున్నాం. దోమలు ప్రబలకుండా చూస్తున్నాం. సేంద్రియ ఎరువులను తయారు చేస్తున్నాం. ఎరువును మొక్కలకు ఉపయోగిస్తున్నాం.