కేశంపేట, జూలై 21 : మౌలిక వసతులు కల్పిస్తూ అభివృద్ధిలో అగ్రగామిగా నిలుస్తున్నది కేశంపేట మండలంలోని ఎక్లాస్ఖాన్పేట గ్రామం. గ్రామంలో ప్రధాన రోడ్లకిరుపక్కలా పచ్చని చెట్లు, అన్ని కాలనీల్లో 100 శాతం సీసీరోడ్లు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, అంతర్గత మురుగునీటి కాల్వల నిర్మాణంతో కాలనీలు చూడ ముచ్చటగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే రూ.2 కోట్లతో సీసీరోడ్ల నిర్మాణం, రూ.60 లక్షలతో అంతర్గత మురుగునీటి కాల్వల నిర్మాణం, రూ.2 లక్షలతో వీధి దీపాల ఏర్పాటుతో గ్రామానికి కొత్త శోభ సంతరించుకుంది. గ్రామానికి కావాల్సిన అన్ని వసతులను షాద్నగర్ ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్ సహకారంతో ఎంపీపీ రవీందర్యాదవ్, సర్పంచ్ కవిత సమకూర్చుతున్నారు. ముఖ్యంగా గ్రామం నుంచి హైదరాబాద్, షాద్నగర్, ఆమన్గల్, కడ్తాల్ పట్టణాలకు వెళ్లేందుకు చిన్నరోడ్లను రహదారులుగా మార్చారు. షాద్నగర్ నుంచి గ్రామం మీదుగా కడ్తాల్ వరకు రూ.48 కోట్లతో నిర్మించిన రెండులైన్ల ప్రధాన రహదారి గ్రామానికి ప్రత్యేక వన్నె తీసుకువచ్చింది.
ప్రకృతి వనం కళకళ..
పల్లెప్రగతిలో భాగంగా ఏర్పాటు చేసిన పల్లెప్రకృతి వనం పచ్చని చెట్లతో కళకళలాడుతున్నది. అన్నివర్గాల ప్రజల అవసరాలకు వైకుంఠధామాన్ని పూర్తి చేశారు. ప్రతిరోజు పారిశుధ్య పనులు చేపట్టి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్నారు. అంతే కాకుండా పంచాయతీ ట్రాక్టర్ను వినియోగిస్తూ తడి, పొడి చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. గ్రామంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు సేవలు అందిస్తున్నారు. మిషన్ భగీరథ పథకం కింద ప్రతి ఇంటికీ నల్లా ఏర్పాటు చేసి తాగునీటిని అందిస్తున్నారు. ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ రౌండ్టేబుల్ స్వచ్ఛంద సంస్థ సభ్యులతో మాట్లాడి పాఠశాలలో 6 అదనపు తరగతి గదులను నిర్మింపజేశారు. గ్రామంలో అభివృద్ధి చేయడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణం
గ్రామంలో లోవోల్టేజి సమస్యను నివారించేందుకు ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ 33/11కేవీ విద్యుత్ సబ్స్టేషన్ను మంజూరు చేయించారు. రూ.1.80 కోట్లతో సబ్స్టేషన్ నిర్మాణం పూర్తి కావడంతో రైతులు సంతోషంగా వ్యవసాయం చేసుకుంటున్నారు.
సుందరంగా వెంకటేశ్వరస్వామి ఆలయం…
గ్రామంలో చిన్నగా ఉన్న లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయాన్ని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, ఎంపీపీ రవీందర్యాదవ్ సొంత నిధులతో పునర్నిర్మాణం చేశారు. ఆంజనేయస్వామి, శివాలయం, నవగ్రహాలు, వేంకటేశ్వరస్వామి, సీతారామాలయాలు సర్వాంగ సుందరంగా నిర్మించడంతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
జిల్లాలో గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం..
అన్నివర్గాల ప్రజల సమస్యలను తీర్చి గ్రామాన్ని అన్ని రంగాల్లో ప్రత్యేకంగా గుర్తింపు తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నాం. గత ప్రజా సమస్యలను ఇప్పటికే నివారించాం. గ్రామంలో 100 శాతం సీసీరోడ్లు, అంతర్గత మురుగునీటి కాల్వలు, ప్రతి ఇంటిలో వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించాం. మిషన్ భగీరథ ద్వారా తాగునీటిని అందజేస్తున్నాం. ఎమ్మెల్యే, ప్రజల సహకారంతో గ్రామాన్ని జిల్లాలోనే ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తాం.
పారిశుధ్యం లోపించకుండా చూస్తున్నాం
పల్లెప్రగతిలో భాగంగా గ్రామంలో నిత్యం పారిశుధ్య పనులు చేపడుతూ పరిశుభ్రంగా ఉంచుతున్నాం. హరితహారంలో గ్రామంలో వేల సంఖ్యలో మొక్కలు నాటి సంరక్షిస్తున్నాం. మొక్కలతో గ్రామంలో పచ్చదనం వెల్లివిరుస్తున్నది. ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్నాం.
గ్రామాన్ని అందంగా తీర్చిదిద్దారు
గతంతో పోలిస్తే రాష్ట్రం ఏర్పడ్డాక గ్రామాన్ని ప్రజాప్రతినిధులు అందంగా తీర్చిదిద్దారు. గ్రామంలో ప్రతి ఇంటికి తాగునీటి సౌకర్యంతో పాటు ప్రతి కాలనీలో వీధి దీపాలు ఏర్పాటు చేశారు. గ్రామంలో మురుగు నీరు రోడ్లపై పారకుండా అంతర్గత మురుగునీటి కాల్వల నిర్మాణం చేపట్టారు. హరితహారం మొక్కలు వృక్షాలుగా ఎదిగి గ్రామానికి పచ్చని శోభను తీసుకువచ్చాయి. గ్రామం అన్ని విధాలుగా అభివృద్ధి చెందడం చాలా ఆనందంగా ఉంది.